సీఆర్డీఏ అధికారులకు రైతుల దిమ్మతిరిగే షాక్: డప్పు చాటింపేసి మరీ!..
గురువారం సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని అన్నదాతలు తీర్మానించుకున్నారు.
అమరావతి: భూసేకరణ విషయంలో సీఆర్డీఏ అధికారులకు రైతుల నుంచి నిరసన తప్పడం లేదు. ఎన్నిసార్లు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నా.. పట్టించుకోని పాపాన లేదని, అలాంటిది.. వాళ్లు పిలిచిన ప్రతీసారి సమావేశానికి ఎందుకు హాజరుకావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
గురువారం నాడు సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని అన్నదాతలు తీర్మానించుకున్నారు. దీనిపై డప్పుతో చాటింపేసి మరీ ప్రచారం చేయించారు. ఇకపై సీఆర్డీఏ అధికారుల సమావేశాలకు వెళ్లకూడదని చాటింపు ద్వారా చెప్పారు.
రెండేళ్లగా సీఆర్డీఏ సమావేశాల్లో చాలాసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశామని, ఎప్పుడూ తమ సమస్యల గురించి పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అంతేనా!.. అక్రమ కేసులు బనాయించి మరీ వేధిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాగా, రాజధాని భూసేకరణ కోసం సీఆర్డీఏ నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారన్న కారణంతో.. గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టించింది. ఇదే కేసుకు సంబంధించి జులై 6న ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం, ఆపై ఆయన బెయిల్ పై విడుదలవడం తెలిసిందే.