ఎపి:సర్కారుపై మరింత సంతృప్తి...రాజధాని జిల్లాల్లో ఇంకా పైకి!
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి శాతం మరింత పెరిగిందట...గడచిన నెలలోనే ఎపి జనాల్లో గవర్నమెంట్ పై సంతృప్త స్థాయిలు గతంలో కంటే మరో పది శాతం పెరిగాయట.
ఎపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయాలు వెల్లడయినట్లు సమాచారం. ఎపి ప్రభుత్వం పనితీరుపై ప్రజల మనోగతం తెలుసుకునేందుకు చేపట్టిన ఈ సర్వేలో గతంలో కంటే ప్రభుత్వంపై సంతృప్త స్థాయిలు పెరిగినట్లు తెలియడంతో అటు బ్యూరోక్రాట్లతో పాటు ఇటు టిడిపి శ్రేణులు సంబర పడుతున్నాయి.
శాటిస్ ఫ్యాక్షన్...పెరిగిందిలా
నెల వ్యవధిలో గవర్నమెంట్ పై ప్రజల్లో ఇలా శాటిస్ ఫ్యాక్షన్ పెరగడానికి వివిధ కారణాలు దోహదపడ్డాయట...ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం కేంద్రంపై వ్యతిరేక వైఖరిని తీసుకోవడం వల్ల జనాల్లో 6% సంతృప్తి పెరిగిందని ఆర్టీజిఎస్ సర్వేలో తేలిందట. కేంద్రంపై వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి ముందు ఎపి జనాల్లో 63% ఉన్న సంతృప్తి...కర్ణాటక పరిణామాల అనంతరం 69%కి చేరింది. కర్ణాటకలో ఎన్నికల సమయంలో టిడిపి వ్యవహార శైలివల్ల తెలుగువారంతా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కటి అయ్యారన్న భావన చోటుచేసుకుందని...ఆ తర్వాత బిజెపి సిఎం గద్దెనధిష్టించడం, అనూహ్యంగా దిగిపోవడం...అనంతరం బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం గద్దెనెక్కిందన్న సంతోషం ఇవన్నీ కలిసి ఎపి ప్రజల సంతృప్తి శాతాన్ని మరింత పెంచాయట.
మరింత సంతృప్తి...మరిన్ని కారణాలు
అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యలు కూడా గవర్నమెంట్ పట్ల సంతృప్తి పెరిగేందుకు దోహద పడిందట...దీంతో పాటు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్రానికి వ్యతిరేకంగా ఉండాలన్నమనోభావాలు...తదనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉండటం...ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంృప్త స్థాయిని మరింత పెంచడంతో పాటు ఎక్కువమందిని ప్రభుత్వం వైపు సానుకూల దృక్పథంతో మెలిగేటట్లు చేస్తోందని ఆర్టీజిఎస్ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
ఈ సర్వే...చేసిందిలా...
ఆర్టీజిఎస్ ఈ సర్వే చేసిన విధానం ఎలా అంటే?...మే 1 వ తేదీ నుంచి మే 26 వరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందట..ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా సుమారు కోటి మంది వివిధ వర్గాల ప్రజలకు ఫోన్లు చేశారట. వీరిలో 24.41 లక్షల మంది తమ తమ అభిప్రాయాలను తెలియచేయగా వారిలో 17.93 లక్షల మంది ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని, 6.47 లక్షల మంది అంటే 26.53% మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారని ఆర్టీజిఎస్ నిపుణుల సర్వేలో తేలినట్లు సమాచారం. అయితే అసంతృప్తి వ్యక్తం చేసినవారి అభిప్రాయం తెలుసుకొని వదిలేయకుండా వారి అసంతృప్తికి కారణం ఏమిటి? వారి సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు గురించి కూడా ఆర్టీజిఎస్ సిబ్బంది సమగ్రంగా అడిగి తెలుసుకున్నారట.
రాజధానిలో జిల్లాల్లో...మరింత సంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్తి స్థాయిల్లో మిగిలిన జిల్లాల కంటే రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మరింత ఎక్కువ స్థాయిలో నమోదైందట. రాష్ట్రవ్యాప్తంగా జనాల సంతృప్తి సగటు 73.47 శాతంగా ఉంటే...రాజధాని జిల్లాలైన గుంటూరు,కృష్ణా జిల్లాలో మాత్రం 77% గా ఉందని ఆర్టీజిఎస్ సర్వేలో తేలిందట. పశ్చిమగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లోను సంతృప్తి స్థాయి 74 శాతం కంటే ఎక్కువగా ఉండగా...కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 70 శాతం నుంచి 73 మధ్యలో సంతృప్తి వ్యక్తం చేశారని ఆర్టీజిఎస్ సర్వేలో తేలింది.