ఇలా ఐతే మనకు కష్టమే!: విజయసాయిరెడ్డికి సొంత ఎమ్మెల్యేల షాక్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఈ ప్రభుత్వంపై అంతలోనే వ్యతిరేకత పెరుగుతోందా? అంటే సొంత పార్టీ నేతలు కూడా అవుననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం 3 నెలల పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అప్పుడే సొంత పార్టీ నేతల్లో కూడా ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయట.
ఇక గగన్యాన్, రోదసీలోకి భారతీయుడు: ఇస్రో శివన్ కీలక వ్యాఖ్యలు, విక్రమ్ కథ ముగిసినట్లే
సొంత ఎమ్మెల్యేల ఆందోళన
ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి వద్ద విశాఖపట్నం జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను చక్కదిద్దకపోతే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని, ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత పెరుగుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎన్ని సమస్యలంటే..
లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, కానీ ఇసుక సరఫరా సరిగా లేక అందరూ ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై వ్యతిరేకత ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ముందుకు కదలడం లేదని, రోడ్ల పరిస్థితి బాగా లేదని చెప్పారు. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయని, కానీ ఆసుపత్రుల్లో మందుల కొరత ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతుందని చెప్పారట. పరిణామాలు రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
టీడీపీ 'వ్యతిరేకత' మాటలు వైసీపీ నేతల నుంచి
ఇసుక పాలసీ మొదలు అమరావతిపై గందరగోళం వరకు ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతుందని చెప్పారని తెలుస్తోంది. జగన్ మూడున్నర నెలల పాలనపై ఇప్పటికే టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి రావడంతో విజయ సాయి రెడ్డి ఒకింత షాక్కు గురయ్యారట.