ప్రభుత్వ బెదిరింపులను ప్రజలు గమనిస్తున్నారు..! వైసీపిలో వాటాల బాగోతం మొదలైందన్న టీడిపి..!!
అమరావతి/హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాటాల బాగోతం అప్పుడే మొదలైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఇసుక కోసం వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొట్టుకునే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, గుమ్మడి సంధ్యారాణితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. మంత్రి అనిల్ యాదవ్ తన రౌడీయిజాన్ని నెల్లూరులో చూపించుకోవాలని రాజేంద్రప్రసాద్ హితవు పలికారు.
ఏపి మండలిలో వాడివేడి చర్చ..! అట్టుడికిన పెద్దల సభ..!!
మండలిలో విధి విధానాలు లేకుండా మంత్రులు వ్యవహరిస్తున్నారని బచ్చుల అర్జునుడు విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రౌడీల మాదిరిగా మండలిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగి, అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. క్యూసెక్కుకు, టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి జలవనరుల శాఖ మంత్రి అంటూ అనిల్ యాదవ్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రశ్నలు అడుగుతున్న వాళ్లనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూషిస్తున్నారని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. మండలిలో మంత్రులు సమాధానం చెప్పలేక సహనం కోల్పోతున్నారని ఆమె దుయ్యబట్టారు.
వైసీపిలో వాటాల బాగోతం మొదలైంది..! మండిపడ్డ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్..!!
ముడుపుల కోసమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రివ్యూల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భవిష్యత్పై ఆవేదనతోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను రైతుల్లో పెంచాలని కోరారు. పార్టీ వ్యూహ కమిటీతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చెప్పిందని అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచామాని చంద్రబాబు గుర్తు చేశారు.
వైసీపీ దుశ్చర్యలు ప్రజలు గమనిస్తున్నారు..! విరుచుకుపడ్డ బాబు.!!
తెలుగుదేశం పార్టీ ముందుచూపు వల్లే ఇప్పుడు యూనిట్ ధర 2.40 రూపాయలకు వస్తోందన్నారు. పీపీఏలపై సమీక్ష పేరుతో కంపెనీలకు బెదిరింపులు తగదని చెప్పారు. 'పీపీఏలన్నీ పారదర్శకమని కేంద్రం చెప్పింది. సాక్షాత్తూ కేంద్రమంత్రి, ఇంధన కార్యదర్శి లేఖలే అందుకు రుజువని చెప్పుకొచ్చారు. ఫిచ్ రేటింగ్స్ సంస్థల హెచ్చిరికలు పట్టించుకోరని గుర్తు చేసారు. పాలకుల మూర్ఖత్వం ప్రజలకు శాపం కారాదని, కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తం కావాలని, రేటింగ్ సంస్థల నివేదికలను పరిశీలించాలని చంద్రబాబు హితవు పలికారు.
టీడీపీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేసింది..! వైసీపీ కావాలనే బురద జల్లుతోందన్న బాబు..!!
తన కంపెనీలు మాత్రం యూనిట్ 5రూపాయలకు అమ్ముకోవాలని, మిగిలిన కంపెనీలు నాశనం కావాలన్న పెడ ధోరణితో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అధికారులపై, కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అంటున్నారని, కర్ణాటకలో మీ కంపెనీ నుంచి 5రూపాయలకు కొన్న అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా అని జగన్ను ఉద్దేశించి అన్నారు.