ఏపీ సీఎం అతి జాగ్రత్త తెచ్చిన తంటా..? సచివాలయంలో సాగని పనులు..!? జనం బారులు..
అమరావతి : జాగ్రత్త మంచిదే. కానీ అతి జాగ్రత్త నష్టం చేస్తుంది. సుపరిపాలన అందించాలన్న సంకల్పంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. సిబ్బంది కొరత, ప్రతి పని మంత్రుల ద్వారానే జరగాలన్న జగన్ వ్యూహం అమలు మినిస్టర్లను ఊపిరాడనీకుండా చేస్తోంది. మరోవైపు రోజుల తరబడి పనులు జరగక జనం సైతం అవస్థలు పడుతున్నారు. ఇది కాస్తా రానున్న రోజుల్లో ప్రజాందోళనలకు దారితీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జాతరను తలపిస్తున్న సచివాలయం
ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ప్రతి రోజు జన జాతరను తలపిస్తోంది. నియోజకవర్గ సమస్యలు, శాఖపరమైన పనులు, సిఫార్సు లేఖల కోసం వందలాది మంది ప్రజలు తరలిస్తున్నారు. మంత్రుల ఛాంబర్లు ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతుండటంతో అమాత్యులకు ఊపిరాడనంత పనవుతోంది. ప్రజా సమస్యల్ని వినేందుకు అతి కష్టంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. మంత్రులు ఇంత కష్టపడి ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధమైనా సిబ్బంది కొరత వారికి పెను సవాల్గా మారింది.
పేషీల్లో సిబ్బంది కొరత
నిజానికి మంత్రులు వివిధ పనులు, సమస్యలపై వచ్చే వారిని ఓఎస్డీ, పీఎస్, పీఏలకు దగ్గరకు పంపుతారు. వారికి సమస్య పరిష్కార బాధ్యత అప్పగిస్తారు. కానీ చాలా మంది మంత్రులకు ఇంకా పీఎస్, పీఏలు కేటాయించలేదు. మంత్రివర్గంలో 25మంది మంత్రులుండగా.. పేషీల్లో కేలం 10మంది సిబ్బంది నియామకానికి మాత్రమే ఉత్తర్వులిచ్చారు. అది కూడా అవసరమైన సిబ్బంది కన్నా తక్కువే ఉన్నారు. మిగిలిన 15 మంది మంత్రుల పేషీల్లో ఆ మాత్రం సిబ్బందిని కూడా నియమించకపోవడం విశేషం.
తలకు మించిన బాధ్యతలు
పలువురు మంత్రులకు ఒకటికి మించిన శాఖల బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. ఒకటి కన్నా ఎక్కువ శాఖలున్న మంత్రులకు ఓఎస్డీతో పాటు ఒక పీఎస్, అడిషనల్ పీఎస్ అసరంకాగా.. పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సిబ్బంది కొరత కారణంగా మంత్రే స్వయంగా సమస్యలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. మంత్రికి కీలక విషయాల్లో సాయం అందించే సిబ్బంది లేని కారణంగా పేషీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇది పనుల్లో జాప్యానికి కారణమవుతోంది.
పేషీ సిబ్బందికి జీతాలు లేవు?
కొందరు మంత్రుల పేషీల్లో సిబ్బంది పనిచేస్తున్నా వారి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అందలేదు. దీంతో నెల రోజులు దాటినా జీతాలు అందక వారు జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పీఏలుగా పనిచేస్తున్న వారి విషయంలో ఈ సమస్య తలెత్తుతోంది. మంత్రులు తమ వ్యక్తిగత సహాయకులుగా తెలిసిన వారిని నియమించుకుంటుండటంతో వారికి ఆమోదముద్ర పడితేనే జీతాలు అందే పరిస్థితి నెలకొంది. ఇది సిబ్బందిలోనూ అసంతృప్తికి దారి తీస్తోంది.
జనాల్లో పెరుగుతున్న అసంతృప్తి
సచివాలయానికి వస్తున్న జనం సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరగాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనాల్లో అసంతృప్తి పెరిగి అది ఆందోళనలకు దారి తీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. ఇలాంటి స్థితి రాకముందే జగన్ సరైన నిర్ణయం తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని జనం అంటున్నారు.