జగన్ పై ప్రజల నమ్మకాన్ని వారి కళ్ళలో చూశాం .. ఫలితాలు నిరాశపరచవు అంటున్న రోజా
ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేత రోజా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ దాదాపు జగన్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ రోజా మాత్రం ఎగ్జిట్ పోల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు రోజాకు కారణం లేకపోలేదు.
ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ ను గుడ్డిగా తాము నమ్మమని, ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలను గుర్తించారని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని వైసీపీ నేత రోజా చెప్పారు . దేశంలో ఏ నాయకుడు ఇంత వరకూ చేయని విధంగా జగన్ పాదయాత్ర చేశారని,జగన్ పాదయాత్ర ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అన్నారు . ప్రజలను కలిసి వారికి అండగా ఉంటానని జగన్ భరోసా కల్పించారని చెప్పారు. జగన్ పై ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వారి కళ్లలో చూశామని, కచ్చితంగా, జగన్ సీఎం కాబోతున్నారని రోజా పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచవని ధీమా వ్యక్తం చేశారు రోజా . కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అయితే బాగుంటుందనుకుని చంద్రబాబును గెలిపిస్తే, రాష్ట్రానికి ఆయనేమీ చేయలేకపోయారని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. చంద్రబాబు సర్కార్ కు చరమ గీతం పాడి జగన్ కు పట్టం కట్టబోతున్నారని రోజా వ్యాఖ్యానించారు.