ప్రజలకు కావాల్సింది స్మార్ట్ సిటీలు కాదు స్మూత్ సిటీలు...బహిర్గతం చేయండి:వామపక్ష నేతలు
విజయవాడ:రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది స్మార్ట్ సిటీలు కాదు స్మూత్ సిటీలు. స్మార్ట్ సిటీలు అభివృద్ధి కిందకి నమూనా కాదు. స్మార్ట్ సిటీల్లో సామాన్య ప్రజలకు చోటెక్కడ? అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి. శ్రీనివాసరావు ప్రశ్నించారు.
పట్టణాల సమగ్రాభివృద్ధిలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనకు నవ్యాంధ్ర రాజధాని విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఉన్న వేదిక ఫంక్షన్ హాలులో ఆదివారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అన్ని మతాలు, కులాల వారు పట్టణాల్లో సామరస్యంగా నివసించే పరిస్థితి ఉండాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ పట్టణ ప్రాంత ప్రజల సమస్యలపై జరిగిన ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, జనసేన నేత పార్ధసారధి, ఆప్ నేత పోతిన రామారావు, ఇతర వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణాలు అందరికీ నివాసయోగ్యంగా, ప్రజానురంజకంగా ఉండాలన్నారు.
చంద్రబాబు ఇప్పటికి 34 సార్లు సింగపూర్ తిరిగినా అమరావతిలో ఏమీ నిర్మించలేదన్నారు. సింగపూర్ సంస్థలతో టిడిపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు కాదని...ప్రజాస్వామ్య ఎన్నికలు రావాలని ఆయన స్పష్టం చేశారు.