జగన్ సర్కార్ అంచనా తప్పిందా ? వెయ్యి కోసం జనం పడిగాపులకు కారణమేంటి ?
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పేదలకు నిత్యావసర సరుకుల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మొత్తాన్ని పేదలకు ఇళ్ల వద్దకే వాలంటీర్ల ద్వారా పంపినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. ఇంకా జనం సచివాలయాల వద్ద పడిగాపులు పడటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అంచనాలు ఎందుకు తప్పాయన్న దానిపై చర్చ సాగుతోంది.
వాలంటీర్ల ద్వారా వెయ్యి సాయం....
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో పేదలకు నిత్యం పనులు లేకుండా పోయాయి. రోజూ పనుల్లోకి వెళితే కానీ కడుపు నిండని వారి కోసం ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సాయాన్ని నేరుగా బియ్యం కార్డులు ఉన్న వారి ఇళ్లకే వాలంటీర్ల ద్వారా పంపింది. నాలుగో తేదీనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పలు జిల్లాలో వెయ్యి రూపాయల పంపిణీ పూర్తయింది కూడా.
అయినా జనం పడిగాపులు..
బియ్యం కార్డు దారులకు ప్రభుత్వం ఇళ్ల వద్దే వాలంటీర్ల ద్వారా వెయ్యి రూపాయలు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. అయినా ఇవాళ్టికీ గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పేద ప్రజలు వెయ్యి రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వాలంటీర్లతో వెయ్యి రూపాయలు పంపిణీ చేసేస్తే వీరంతా ఎందుకు సచివాలయాల దగ్గరికి వస్తున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇవాళ సోమవారం కావడంతో రాష్ట్రంలో పలు సచివాలయాల వద్ద జనం పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
జనం పడిగాపులకు కారణమిదే..
వాలంటీర్ల ద్వారా బియ్యం కార్డు దారులకు ఇళ్ల వద్దే వెయ్యి రూపాయల పంపిణీ పూర్తి చేసినా సచివాలయాల వద్దకు జనం తరలి రావడాన్ని బట్టి చూస్తుంటే వీరంతా తెల్ల రేషన్ కార్డు దారులుగా అర్ధమవుతోంది. గతంలో బీపీఎల్ కేటరిగీలోకి వచ్చే పేదలకు తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. వాటి స్ధానంలో హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం బియ్యం, పింఛనుకు వేర్వేరు కార్డులను తీసుకొచ్చింది. గతంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారిలో ఎవరైనా బియ్యం తీసుకుంటుంటే వారికి బియ్యం కార్డులు, పింఛను తీసుకుంటున్న వారికి పెన్షన్ కార్డులు ఇచ్చేశారు. ఇక మిగిలింది ఏ సాయం తీసుకోకుండా కేవలం రేషన్ కార్డులు కలిగిన వారు మాత్రమే. వీరికి కార్డులున్నా వాటిని ఎప్పుడో రద్దు చేసేశారు. కానీ ఇప్పుడు కరోనా సాయం కోసం ఈ కార్డులను తీసుకుని జనం సచివాలయాలకు వస్తున్నట్లు తెలుస్తోంది.
చేతులెత్తేసిన ప్రభుత్వం..
గతంలో తెల్ల రేషన్ కార్డు దారులను పేదలుగా గుర్తించిన ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో వాటిని రద్దు చేసి బియ్యం, పెన్షన్ కార్డులు ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని మాత్రం బియ్యం కార్డుదారులకే పరిమితం చేసింది. దీంతో మిగతా కార్డులు కలిగిన వారంతా ఇప్పుడు సచివాలయాల వద్దకు చేరుకుని పడిగాపులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం బియ్యం కార్డు దారులకే సాయం ఇవ్వాలని నిర్ణయించడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
కరోనా వ్యాప్తి ప్రమాదం..
కారణాలు ఏవైనా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో, అదీ రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో సచివాలయాల వద్దకు జనం గుంపులు గుంపులుగా రావడాన్ని నిరోధించాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది. లేకపోతే కరోనా వైరస్ మరింత జోరుగా వ్యాప్తి చెందే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.