పొత్తు షాక్: 'బాబు అలా చేస్తే దుర్మార్గమే కానీ, గుడ్డలూడదీసి కొడతారు, పార్టీ వీడుతా'
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు తెలుగుదేశం పార్టీ - కాంగ్రెస్ పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తుండగా, టీడీపీ సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలవడం లేదా అవగాహనతో వెళ్లడం జరగడం ఖాయమని అంటున్నారు. దీనిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. అదే సమయంలో.. అదే నిజమైతే ప్రజలు బట్టలూడదీసి కొడతారని, మాలాంటి వాళ్లం పార్టీకి గుడ్ బై చెబుతామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అది గుర్తుంచుకోవాలిగా.. షాకిస్తున్నారు: కన్ఫ్యూజన్గా పురంధేశ్వరి వ్యాఖ్యలు!
టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై పార్టీ అధిష్టానం మరింత స్పష్టత ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్తే పార్టీకి నష్టమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు, లోకేష్ వంటి వారు పూర్తి క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. మంత్రులు అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి వంటి వారు పొత్తును ఖండిస్తూనే, అదే జరిగితే అని మాట్లాడటాన్ని బట్టి అధిష్టానం స్పష్టతనివ్వాల్సిన ఆవశ్యకత ఉందని చెబుతున్నారు.
చంద్రబాబు అలా చేస్తే, అంతకంటే దుర్మార్గం ఉండదు
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఇద్దరు మంత్రులు కేఈ, అయ్యన్న తేల్చి చెప్పారు. అసలు అలాంటి ఆలోచనే లేదన్నారు. అలాంటి పరిస్థితే వస్తే పార్టీని వీడటానికీ వెనుకాడబోనని అయ్యన్న తేల్చి చెప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని, చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ కలిస్తే అంతకంటే దుర్మార్గం ఉండదని, రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసి దోచుకుతిన్న కాంగ్రెస్తో కలవాలని భావిస్తే మొదట వ్యతిరేకించేది తానే అని అయ్యన్న అన్నారు.
అలా చేస్తే బట్టలూడదీసి తంతారు కదా
ఒకవేళ తప్పనిసరై కలిస్తే టీడీపీలో తాను ఉండలేనని అయ్యన్న చెప్పారు. పొలిట్ బ్యూరోలో చర్చలేకుండా పొత్తుల నిర్ణయం జరగదని, కాంగ్రెస్ను తరిమికొట్టేందుకు ఎన్టీఆర్ శ్రమించారని, చంద్రబాబు తప్పు చేయబోరని తాను అనుకుంటున్నానని, నిజంగా కలిస్తే జనం బట్టలూడదీసి తంతారు కదా అన్నారు.
ఆ దరిద్రం మాకెందుకు
కాంగ్రెస్తో టీడీపీ పొత్తు అసాధ్యమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని అంటగట్టుకోమని కేఈ అన్నారు. టీడీపీకి శత్రువులు కాంగ్రెస్, మోడీ, జగన్తోపాటు కొత్తగా జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్యపరిచి కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని తెలియజేసేందుకు చంద్రబాబు ప్రతి జిల్లాలో ధర్మపోరాటం చేస్తున్నారన్నారు.
ఒంటరిగానే బరిలోకి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెస్తో పొత్తుపై టీడీపీలో ఎలాంటి చర్చ లేదని మంత్రి పి నారాయణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రధానిని మనమే నిర్ణయించాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు. ఆ దిశగా ఇప్పటికే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని చెప్పారు.