కిడారికి రాత్రే ఫోన్ చేశా...భారీ సభ పెడతానన్నారు;కిడ్నాప్ చేయాల్సింది:మంత్రి నక్కా ఆనందబాబు
అమరావతి:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేయడంపై ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే కిడారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
గత రాత్రే తాను ఎమ్మెల్యే కిడారికి ఫోన్ చేసి మాట్లాడానని...విశాఖ రాబోతున్నట్లుగా చెబితే ఈ నెల 28 వ తేదీన వస్తే భారీ సభ పెడతానని చెప్పారని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తుంటే పొట్టనపెట్టుకుంటారా?...అని మావోయిస్టులను నిలదీశారు.
నిన్న రాత్రే...మాట్లాడాను
గత రాత్రి 8 గంటలకు తాను అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు ఫోను చేశానని...సిగ్నల్స్ సరిగ్గా లేవని...నా మాటలు సరిగా వినిపించడం లేదని...మళ్లీ 15 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేశారన్నారు. ఈ తర్వాత 20 నిమిషాలకు కిడారినే ఫోన్ చేశారని చెప్పారు. తాను ఈ నెల 25న విశాఖ వస్తున్నానని చెబితే...ఆ రోజున జిల్లా మీటింగ్ ఉందని, కాబట్టి 28న వస్తే భారీ సభ పెడతానంటూ ఆత్మీయంగా స్పందించారని...కానీ ఇంతలోనే ఇలా జరగడం కలిచివేసిందన్నారు.
Recommended Video
పోలీసుల వైఫల్యం...లేదు
ఎమ్మెల్యే కిడారికి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నారు. ఈ ఘటనలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం లేదని మంత్రి నక్కా అన్నారు. ఇది మావోల దుర్మార్గమైన చర్య అని మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. హత్యకు గురైన ప్రజాప్రతినిధులిద్దరూ చిత్తశుద్ధితో పని చేసేవారని మంత్రి నక్కా కితాబిచ్చారు. అలాంటి వాళ్లు మావోల దాడికి గురికావడం బాధాకరమన్నారు. మాటువేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉనికిని చాటుకోవడానికే మావోలు ఈ విధంగా చేశారని తప్పుపట్టారు. ఈ దాడిలో 50, 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లుగా సమాచారం అందిందన్నారు.
కిడ్నాప్ చేయాల్సింది...
మావోయిస్టులకు ఏవైనా సమస్యలుంటే వారిద్దరిని కిడ్నాప్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరించేవారమని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగానే కిడారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినా...టీడీపీలో చేరారని మంత్రి నక్కా చెప్పుకొచ్చారు. కిడారి ప్రజల సమస్యలను ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉండేవారన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమ కూడా గిరిజనుల సంక్షేమం కోసం పాటు పడేవారని ప్రశంసించారు. బాబ్లీ కేసులో కూడా సోమ ఉన్నారని గుర్తుచేశారు.
దారుణం...అమానుషం
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల కాల్చివేతపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామ దర్శనికి హాజరైన ప్రజా ప్రతినిధులను హత్య చేయడం అమానుషం అన్నారు. అరకు ఏజెన్సీలో వైద్య వసతుల అభివృద్దికి కిడారి, సివేరి పాటుపడ్డారని మంత్రి కళా గుర్తుచేసుకున్నారు. రూ.166 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు అభివృద్ది చేశారని చెప్పారు. ముంచెంపట్టు, పెదబయలు వద్ద ఆసుప్రతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. అరకు ఆసుపత్రిని 50పడకల నుంచి 100 పడకలకు పెంచారన్నారు. పాడేరు జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి వీరు విశేష కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు. ఏజెన్సీలో తారురోడ్ల నిర్మాణానికి పరితపించారని, ఏజెన్సీని అభివృద్ధి చేస్తున్న ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు ఇలా హత్య చేయడం దారుణం అన్నారు.