చంద్రబాబు దీక్ష..కొత్త ట్విస్ట్ : పోలీసుల అనుమతి నిరాకరణ: చేసి తీరుతామంటున్న టీడీపీ..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబుకు దీక్షకు మున్సిపల్ స్టేడియం లో అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు విజయవాడ నగర పోలీసు కమిషనర్ ను కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగంచే మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వలేమంటూ పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. దీంతో..టీడీపీ నేతలు దీని పైన అధినేతకు సమాచారం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష చేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Chandrababu: హ్యాపీ బర్త్ డే అద్వానీజీ: బీజేపీ కురువృద్ధుడికి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు..!
అదే సమయంలో ప్రత్యామ్నాయ వేదిక పైనా పార్టీ నేతలు సమాలోచన చేస్తున్నారు. దర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహించే ప్రతిపాదన గురించి చర్చిస్తున్నారు. అయితే, దాదాపు 12 గంటల పాటు అధినేత దీక్ష..పెద్ద సంఖ్యలో కార్యకర్తలు..భవన నిర్మాణ కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించాలని భావిస్తున్నారు. అవసరమైతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొనే అంశం పైన సమాచాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
14న చంద్రబాబు 12 గంటల దీక్ష..
ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్ష చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. విజయవాడ వేదికగా ఈ దీక్ష చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. దీంతో..చంద్రబాబు దీక్ష కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు పార్టీ నేతలు సమాయత్తం అయ్యారు. ఏపీలో ఇసుక వ్యవహారం పైన ఇప్పటికే లోకేశ్ గుంటూరులో దీక్ష చేసారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విశాఖలో లాంగ్ మార్చ్..సభ నిర్వహించారు. ప్రభుత్వం రెండు వారాల్లోగా ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు నష్టపరి హారం ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసారు. లేకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసారు. బీజేపీ నేతలు సైతం ఇసుక సత్యాగ్రహం నిర్వహించారు. ప్రభుత్వం ఇసుక సమస్య తాత్కాలికం అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. దీంతో..ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచటానికి చంద్రబాబు దీక్ష చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఈ నెల 14న విజయవాడలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.
అనుమతి నిరాకరణ..
ఈ నెల 14న చంద్రబాబు దీక్ష కోసం మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్..నగర పోలీసు కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. అయితే, చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని అధికారులు తేల్చేసారు. ఆ రోజు బాలల దినోత్సవం కావటంతో ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. స్టేడియం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసారు. దీంతో..టీడీపీ నేతలు ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జన్మదినం నాడు ఇదే స్టేడియంలో ధర్మ పోరాట దీక్ష చేసారు. అయితే, 12 గంటల పాటు చంద్రబాబు చేసే దీక్షకు మద్దతు ఇతర పార్టీల నేతలను...పార్టీ శ్రేణులతో పాటుగా..భవన నిర్మాణ కార్మికులు తరలి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ధర్నా చౌక్ సరైన వేదిక కాదనే అభిప్రాం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం అక్కడ అయినా అనుమతి ఇస్తుందా లేక కొర్రీలు పెడుతుందా అనే ఉత్కంఠ టీడీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. దీంతో..అధికారులు అనుమతి నిరాకరించిన విషయాన్ని పార్టీ అధినేతకు నివేదించారు.
మరో రాజకీయ వివాదంగా..
చంద్రబాబు దీక్షకు అనుమతి ఇవ్వకపోవటం..ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్మ మరో రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో విశాఖలో ప్రత్యేక హోదా కోసం జగన్ ర్యాలీకి పిలుపు ఇస్తే ఆ సమయంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు కారణంగా అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం నిరాకరించి..విశాఖ విమానాశ్రయంలోనే జగన్ ను అడ్డుకుంది. ఇక, చంద్రబాబు దీక్ష గురించి ప్రకటించగానే.. మంత్రి బొత్సా దీని పైన కామెంట్లు చేసారు. బాలల దినోత్సవం నాడు దీక్ష ఏంటని ప్రశ్నించారు. దీని ద్వారా ప్రభుత్వం ఇక, విజయవాడలో చంద్రబాబు దీక్షకు అనుమతి ఇవ్వటం అనుమానంగానే ఉంది. దీంతో..రానున్న రోజుల్లో ఇది మరింత రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.