చంద్రబాబుకు కొత్త తలనొప్పి: 'ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వం'
అమరావతి: బందురు పోర్టు నిర్మాణంలో భూ సమీకరణ విధానాన్నే అమలు చేయాలని శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ బందరు పోర్టు పేరుతో మండలంలోని 34 గ్రామాలు లేకుండా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
పరిశ్రమల పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు భూములు అమ్ముకోవడానికి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా రైతులు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వరని ఆయన తేల్చి చెప్పారు. జైలుకైనా వెళ్తాం, అవసరమైన ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన 4,800 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధమని, అంతకుమించి ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదని అన్నారు. అందులో కూడా రైతులకు రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు భూముల విషయంలో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
మరోవైపు బందరు పోర్టు నిర్మాణంలో భూ సమీకరణ విధానాన్నే అమలు చేయాలని, రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన వారికి అభివృద్ధి చేసిన భూమిలో వాణిజ్య, నివాస స్థలాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు భూసమీకరణ అధికారాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
మరో వైపీసీ నేత గౌతంరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ బందరు పోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు పరోక్ష వాటాలున్నాయని ఆరోపించారు. వాటాలున్నందుకే లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా సేకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని విమర్శించారు.
భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిపక్ష వైసీపీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. రైతులకు అండగా వైసీపీ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. మొత్తం భూమిలో 22వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమి పారిశ్రామిక కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.