రా! చూపిస్తాం!!: మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని నిప్పులు
మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్రపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని నిప్పులు చెరిగారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో 18 మంది చనిపోవడానికి ఇతర కారణాలున్నాయని, విషజ్వరాలు మరణాలకు కారణం కాదని కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
కొత్త మాజేరు గ్రామ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మచిలీపట్నంలో మంగళవారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర తనతో పాటు కొత్తమాజేరుకు రావాలని, విషజ్వరాలతో చనిపోయిన 18 మంది ఇళ్లకు వెళ్దామని, వాళ్లని అడుగుదామని ఆయన అన్నారు.
వారు మామూలుగా చనిపోయారా, కలుషిత నీళ్లు తాగి జ్వరాలతో మరణించారా అని అడుగుదామని ఆయన కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నామని అవాకులు చెవాకులు పేలడం సరి కదాని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని అంటారని, కానీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం నోటికి వచ్చింది మాట్లాడుతూ ఊరికి ఏమీ చేయకుండా అధికార మదంతో విర్రవీగుతున్నారని పేర్ని నాని విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ అలసత్వం కారణంగానే కొత్తమాజేరులో 18 మంది చనిపోయారని ఆయన అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేకపోయినా ఇంటి పక్కన బడ్డీ కొట్టులో మాత్రం ఫుల్గా బ్రాందీ దొరుకుతుందని ఆయన అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండంటూ ఇంటింటికీ వెళ్లి గడపగడపా తొక్కి ఓట్లు అడిగిన కొల్లు రవీంద్ర ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. మూడు శాఖలను చేతిలో పెట్టుకున్న కొల్లు రవీంద్ర మచిలీపట్నానికి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.