‘విషమైనా తీసుకుంటా కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరను’
మచిలీపట్నం: 'విషమైనా తీసుకుంటా కానీ టీడీపీలో చేరను' అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ, వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు.
తాను టీడీపీలోకి చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మచిలీపట్నంలోని స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాల యంలో గురువారం పేర్నినాని విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీలో చేరుతున్నానని మీడియాలో వచ్చిన వార్తలకు ఎలాంటి విశ్వసనీయత లేదని అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వైయస్ కుటుంబాన్ని ఆ పార్టీ అధిష్టానం వేధింపులకు గురిచేయడం, కక్ష సాధింపులకు దిగడంతో తాను మనస్తాపానికి గురై వైయస్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుని, ఏడాదిన్నరకు ముందే ఎమ్మెల్యే, విప్ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరానని గుర్తుచేశారు.
తాను పదవుల కోసమే ఆలోచించే వ్యక్తినే అయితే ఏడాదిన్నరకు ముందే క్యాబినెట్ హోదా గల విప్ పదవిని వదలి పార్టీ మారేవాడినే కాదని అన్నారు. తనకు వైయస్పై అపారమైన, అచంచలమైన ప్రేమాబిమానాలు ఉన్నాయని చెప్పారు. తన ఊపిరి ఉన్నంత వరకూ వైయస్ కుటుంబానికి అండగానే ఉంటానని తేల్చిచెప్పారు.
తన చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకతతోనే పెరిగానని, అలాంటి తాను నేడు ఆ పార్టీలో ఏమి ఆశించి చేరాలని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన హయాంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పిన నాని అవే తనకు సంతృప్తిని ఇస్తాయని చెప్పారు.