లోకేశ్ కు 200 మంది ప్రైవేటు బౌన్సర్లు - అనుక్షణం 400 వాలంటీర్లు..!!
లోకేశ్ పాదయాత్ర వేళ 200 మంది బౌన్సర్లను భద్రత కోసం నియమించారు. 400 మంది వాలంటీర్లు లోకేశ్ ను అనుసరించనున్నారు.
నారా లోకేశ్ పాయాత్రకు భారీ ఏర్పాట్లు చేసారు. లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. కుప్పం నుంచి 400 మంది వాలంటీర్లు లోకేష్ ను అనుసరించనున్నారు. పాదయాత్ర వేళ లోకేశ్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారవాన్ సిద్దం చేసారు. సకల హంగులతో దీనిని ఏర్పాటు చేసారు. తొలి రోజు యాత్ర.. బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొనున్నారు.
ముందుగానే కుప్పం చేరుకున్న పార్టీ నేతలు బహిరంగ సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సభా వేదిక పై 300 మంది ఆశీనులు కానున్నారు. అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక..లోకేశ్ భద్రత కోసం ప్రత్యేకంగా బౌన్సర్లను సిద్దం చేసుకున్నారు. వాలంటీర్లు యాత్ర మొత్తం లోకేశ్ తో పాటుగా కొనసాగనున్నారు.
400 మంది వాలంటీర్లు లోకేశ్ యాత్రలో
లోకేశ్ పాదయాత్ర జరగనున్న 400 రోజులు ఆయన వెంట 400 మంది వాలంటీర్లు ఫాలో అవుతారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వారిని వాలంటీర్లుగా నియమించారు. వీరు రోజూ యాత్ర ముగిసిన తరువాత లోకేశ్ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు. అక్కడే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎక్కడా ఎటువంటి లోటు రాకుండా వారిని ఎక్కడికి అక్కడ స్థానిక నాయకత్వం చూసుకోనుంది. వారి బాధ్యతలను అన్ని జిల్లాల్లో తెలుగు యువత నాయకత్వానికి అప్పగించారు. లోకేశ్ యాత్రతో కొనసాగటంతో పాటుగా రాకీయంగా ఏమైనా అనుకోని ఘటనలు ఎదురైన సమయంలో వీరు లోకేశ్ కు రక్షణగా నిలుస్తారు.
200 మంది బౌన్సర్లతో ఏర్పాట్లు
కుప్పం సభ వేళ ప్రత్యేకంగా భద్రత కోసం 200 మంది బౌన్సర్లను నియమించారు. 400 మంది పార్టీ వాలంటీర్లతో పాటుగా వీరికి అదనంగా బాధ్యతలు కేటాయించారు. తొలి రోజు పాదయాత్ర ముగిసే వరకు వీరు కొనసాగనున్నారు. తొలి రోజు సభకు భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు..కార్యకర్తలు తరలి వస్తుండటంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. బహిరంగ సభలో లోకేశ్ తో పాటుగా బాలక్రిష్ణ మాత్రమే ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాదయాత్రకు ముందుగా లోకేశ్ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, లక్ష్మీపురంలోని మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తారు.
పోలీసులు రెండు చోట్లా వేర్వేరుగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు ఏఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి సహా మరో ముగ్గురు డీఎస్పీలు, సుమారు 500 మంది పోలీసులు తొలిరోజు బందోబస్తు నిర్వహించనున్నారు.
లోకేశ్ కోసం క్యారవాన్ సిద్దం..
లోకేశ్ పాదయాత్ర వేళ ఆయన బస చేయటానికి.. అంతర్గత సమావేశాల కోసం ప్రత్యేక హంగులతో సిద్దం చేసిన క్యారవాన్ కుప్పం చేరుకుంది. రోజూ యాత్ర ప్రారంభం.. ముగిసిన తరువాత పార్టీ నేతలతో ఆ రోజు కార్యక్రమాలు.. ప్రణాళికల పైన పార్టీ నేతలతో చర్చించేందుకు వీలుగా క్యారవాన్ లో చిన్న సమావేశాల నిర్వహణకు వీలుగా సౌకర్యాలు కల్పించారు.
అదే సమయంలో రూట్ మ్యాప్ కు అనుగుణంగా జిల్లాల పోలీసు అధికారులు ఎక్కడికి అక్కడ లోకేశ్ యాత్రకు బందో బస్తు కల్పించనున్నారు. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన చోట ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లోకేశ్ యాత్రలో రోడ్ షో లు.. సభలకు సంబంధించి జిల్లా స్థాయిలోనే అధికారులు నిర్ణయాలు తీసుకోనున్నారు.