రైతులకు 5 వేల ఫించను : పిజీ వరకు ఉచిత విద్య : ఎన్నికల వరాలు ప్రకటించిన పవన్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతులకు వరాలు ప్రకటించారు. రాజమండ్రి వేదికగా ఎన్నికల శంఖారావం పూరించా రు. పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారో ప్రకటించారు. ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయంతో పాటు 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు రూ.5వేల పింఛను అందిస్తామని ప్రకటించారు.
మేనిఫెస్టో విడుదల..
ఎన్నికల వేళ..జనసేన అధినేత తాము అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసారు. రైతులకు 8వేల పంట పెట్టుబడితో పాటుగా 60 ఏళ్లు పై బడిన సన్న..చిన్న కారు రైతులకు అయిదు వేల ఫించను అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటు రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందజేస్తామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. యువత, మహిళలకు భరోసా కల్పిస్తూ హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టిన తొలి ఆరునెలల్లో లక్ష ఉద్యోగాలు.. ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాల కల్పనే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు.
యువతకు ప్రాధాన్యత..
తాము అధికారంలోకి వస్తే మొదట ఉద్యోగాల కల్పన పై దృష్టి సారిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అదే విధంగా.. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు చెల్లించే లా నిర్ణయం తీసుకుంటామననారు. ఏపిలో ఎవరూ లంచం అడగని వ్యవస్థ రూపకల్పన చేస్తామన్నారు. విద్యార్ధుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వోద్యోగుల కోసం సీపీ ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. నదులు అనుసంధానం చేసి కొత్త జలాశయాలు నిర్మాణం చేపడతామన్నారు. మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు. వేటకు వెళ్లని సమయంలో వారికి రోజుకు రూ.500ఆర్థిక సహాయం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేస్తామన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..
అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు అమలు చేస్తామన్నా రు. ముస్లింల అభ్యున్నతి కోసం సచార్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించారు. స్త్రీలకు అండగా ఉం డే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన. ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం చేపడతామన్నారు. మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా మని వెల్లడించారు. అన్ని మతాల మహిళలకు ఆయా పండుగలకు చీరల పంపిణీ చేస్తామని.. ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఇక, మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు తో పాటుగా..మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.