ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలి: సుప్రీంలో పిటీషన్: నేడు విచారణ..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..బ్రేక్ పడుతుందా. ఈ రోజు చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీని పైన విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. ఈనెల 17 న షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు సైతం ప్రకటించింది. ఇప్పుడు ఇదే అంశం పైన ఇప్పుడు సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. 50 శాతానికిపైగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని..స్థానికసంస్థల ఎన్నికలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్ల పైన నేడు జరిగే విచారణ పైన ఇప్పుడు ఏపీలో ఉత్కంఠ నెలకొని ఉంది.
సుప్రీంకోర్టులో పిటీషన్లు...
ఆంధ్రప్రదేశ్లో స్థానికసంస్థల ఎన్నికలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యా యి. రిజర్వేషన్లు 50% మించరాద న్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కర్నూలుజిల్లాకు చెందిన బిర్రు ప్రతా్పరెడ్డి, ఆనంతపురంజిల్లాకు చెందిన బీసీ రామాంజనేయులు ఈ పిటిషన్లు వేశారు.
అయితే, ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ పిటిషన్ ద్వారా హైకోర్టు తీర్పును సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు..కొత్త సెక్షన్లు రాజ్యంగా విరుద్దంటమూ పిటీషన్ లో వివరించారు.
నేడు విచారించనున్న సీజే ధర్మాసనం!
రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 176ను రద్దు చేయాలని పిటీషనర్ కోరారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో చేర్చిన 9, 15, 152, 153, 180, 181వ సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని కొట్టివేయాలని అభ్యర్థించారు. కాగా, ఈ పిటిషన్లలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్, అనంతపురంజిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు.
కాగా, వీటి పైన ఈ రోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘంతో పాటుగా ప్రభుత్వం అదే విధంగా రాజకీయ పార్టీలు సుప్రీంలో జరిగే విచారణ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.