వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్: మంత్రి వెల్లంపల్లి సహా ఇద్దరిపై హైకోర్టులో పిటీషన్: కాస్సేపట్లో
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాయపరమైన వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఒకదాని తరువాత ఒకటిగా వరుస బెట్టి హైకోర్టులో పిటీషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందటే అయిదుమంది వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. తాజాగా మంత్రి సహా మరో ఇద్దరిపై హైకోర్టులో పిటీషన్లను వేశారు. విజయవాడకు చెందిప ప్రముఖ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ ఈ పిటీషన్లను దాఖలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పని.. వారిని హైకోర్టు మెట్లెక్కేలా చేస్తోందిగా: పిల్ దాఖలు చేసిన అడ్వొకేట్
మంత్రి వెల్లంపల్లి సహా
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ) స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారనేది పిటీషన్దారుడి వాదన. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమౌతున్నారని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ కాస్సేపట్లో విచారణకు రానుంది.
లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన..
లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఈ ముగ్గురూ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు సోషల్ డిస్టెన్సింగ్ను పాటించలేదని పిటీషనర్ ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బహిరంగంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని, జన సమూహం మధ్య పార్టీ పరమైన కార్యక్రమాలను నిర్వహించారని పేర్కొన్నారు. మల్లాది విష్ణు, ఉండవల్లి శ్రీదేవి లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా తమ నియోజకవర్గాల పరిధిలో తిరిగారని అన్నారు.
ఎనిమిది మందిని నోటీసులు..
దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులు, ఫొటోలను తన పిటీషన్కు జత చేర్చారు. తాజా పిటిషన్తో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్సార్పీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇదివరకు బియ్యపు మధుసూధన్ రెడ్డి (శ్రీకాళహస్తి) వెంకట్ గౌడ (పలమనేరు), ఆర్కే రోజా (నగరి), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), విడదల రజినీ (చిలకలూరి పేట)లపై హైకోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ విషయంలో వారికి హైకోర్టు నోటీసులను కూడా జారీ చేసింది.
కాస్సేపట్లో విచారణకు ఛాన్స్..
తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఉండవల్లి శ్రీదేవిలపై పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ ముగ్గురికి కూడా హైకోర్టు నోటీసులను జారీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ పిటీషన్ మరి కాస్సేపట్లో హైకోర్టు ధర్మాసనం సమక్షానికి విచారణకు రానుంది. ఈ సందర్భంగా వారికి నోటీసులను జారీ చేస్తారని అంటున్నారు. ఈ ఎనిమిది మందిపై వేర్వేరుగా దాఖలైన పిటీషన్లను ఒకటిగా జోడించి.. హైకోర్టు విచారణ చేపడుతుందని చెబుతున్నారు.