ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలను సాకుగా చూపి ఆయన పాదయాత్రకు అడ్డుపడాలని చూడడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఎవరికైనా ఉంటుందని పేర్కొంది కోర్టు. ఒకవేళ ఏదైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే పోలీసులు పర్యవేక్షించాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పిటిషన్తో ఉత్కంఠ!
ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో.. పాదయాత్రను సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
ముద్రగడ పాదయాత్రను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో.. హైకోర్టులో దీనిపై వాదనలు జరిగాయి. మంగళవారం నాడు ఉదయం పిటిషన్ పై విచారణ చేపట్టగా.. ప్రభుత్వ న్యాయవాది వాదనలు విన్న కోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం మధ్యాహ్నాం మళ్లీ విచారణకు రావడంతో.. పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు తీర్పు వెలువడింది.
అనుమతి కోరేది లేదు : ముద్రగడ
పాదయాత్రకు అనుమతి తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొనడం.. కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలోను ఇదే అంశం ప్రస్తావనకు రావడంతో.. ముద్రగడ పాదయాత్రకు 'పర్మిషన్' చిక్కులు తప్పవా? అన్న అభిప్రాయాలు అంతకుముందు వ్యక్తమయ్యాయి. మరోవైపు ముద్రగడ మాత్రం అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
గతంలో వైఎస్, చంద్రబాబు లాంటి నాయకులు పాదయాత్రలు చేసినప్పుడు అనుమతులు తీసుకునే చేశారా? అన్నది ఆయన ప్రశ్న. మొత్తానికి అనుమతి లేని కారణంగా పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటామని చెప్పడంతో.. ముద్రగడ పాదయాత్రపై హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద బారీగా పోలీసులు మోహరించగా..స్పెషల్ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్ సైతం రంగంలోకి దిగింది.
తుని సభలో విధ్వంసం చోటు చేసుకోవడం.. ఆ తర్వాత ముద్రగడ నిరాహార దీక్ష సందర్బంలోను టెన్షన్ వాతావరణం నెలకొనడం.. ఇప్పుడు పాదయాత్ర విషయంలోను అదే పరిస్థితి కొనసాగుతుండడం.. సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. దీంతో బుధవారం నాడు తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్ర ఎంతమేర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.