ఏపీ వార్డు వాలంటీర్లకు ఫోన్లు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్-ఎస్ఈసీ ఆదేశాల ఉల్లంఘనపై
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది వార్డు, గ్రామ వాలంటీర్లను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ గతంలో ఆదేశాలు ఇచ్చారు. వీరు ప్రస్తుతం వాడుతున్న సెల్ఫోన్లను సైతం అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. కానీ రాష్ట్రంలో ఆ ఉత్తర్వుల అమలు మాత్రం జరగడం లేదు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో వార్డు వాలంటీర్లు విస్తృతంగా తిరిగుతున్నారు. పలుచోట్ల అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు వాలంటీర్లు తమ విధులను కూడా పక్కనబెట్టి ప్రచారంలో పాల్గొంటున్న పరిస్ధితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా వీరు సెల్ఫోన్లు వాడుతుంటడంపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే కోవలో హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.
ఎన్నికల సమయంలో వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్ వినియోగాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఫోన్ల వాడకం ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై విచారణ సందర్భంగా ఇప్పటికే ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనకుండా కూడా ఆదేశాలు ఉన్నాయన్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు హైకోర్టును సమయం కోరారు. దీంతో విచారణను మార్చి 1కి హైకోర్టు వాయిదా వేసింది.