మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!
అమరావతి : ఇంకా మొదలే కాలేదు.. అంతలోనే లొల్లి. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక గ్రామ వాలంటీర్ల నియామకానికి పచ్చజెండా ఊపారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ వాలంటీర్ల నియామకాలను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ మేరకు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడమే గాకుండా నియామక ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. జులై 11వ తేదీ గురువారం నుంచి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించేలా సన్నద్దమవుతున్నారు. అయితే సరిగ్గా దానికంటే ఒకరోజు ముందు బుధవారం నాడు కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం చర్చానీయాంశమైంది. ఆ పిటిషన్ గురువారం విచారణకు రానుండటంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఆదిలోనే హంసపాదు.. హైకోర్టులో పిటిషన్
ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవెర్చే క్రమంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఆ క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 5వ తేదీ నాటికి చివరి గడువు ఉండటంతో దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వనున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా నెలకు వంద కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుంది. ఆ లెక్కన సంవత్సరానికి 1200 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.
గోల్డ్ స్మగ్లింగ్లో కొత్త ట్విస్ట్.. ఆ యాత్రికులు బలవుతున్నారా?
ఇంటర్వ్యూ ప్రక్రియపై నిరసన.. హైకోర్టు మెట్లెక్కారు..!
దరఖాస్తు ప్రక్రియ ముగిసి వాటి పరిశీలన కూడా పూర్తికావడంతో ఇక మిగిలింది ఇంటర్వ్యూలే. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్వ్యూల ద్వారా గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టడం సరికాదంటూ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి గురువారం (జులై 11వ తేదీ) నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కావాల్సి ఉంది. అంతలోనే కొందరు నిరుద్యోగులు న్యాయస్థానానికి వెళ్లడం హాట్ టాపికైంది.
జులై 11 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఆగస్టు ఒకటో తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించాలనేది షెడ్యూల్. దాని తర్వాత ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్ ఇచ్చి 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగించాలని డిసైడయ్యారు అధికారులు. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కొందరు బుధవారం నాడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అది గురువారం నాడు విచారణకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దాంతో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
గురువారమే ఇంటర్వ్యూలు.. ఒక్క రోజు ముందు కోర్టులో పిటిషన్
సంక్షేమ పథకాలను లబ్దిదారులకు సక్రమంగా చేరవేయాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల నియమకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించేలా చర్యలు తీసుకుంటున్నారు. వాలంటీర్లుగా సెలెక్ట్ అయినవారు తమ పరిధిలోని 50 కుటుంబాలకు వారధిగా ఉండాల్సి వస్తుంది. ఆయా కుటుంబాల నుంచి వచ్చే వినతులు గానీ, సమస్యలు గానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పనిచేయాల్సి ఉంటుంది.
గ్రామ వాలంటీర్లుగా పనిచేయడానికి చాలామంది నిరుద్యోగులు ముందుకొచ్చారు. ఆ క్రమంలో పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు. 2 లక్షల మంది వరకు గ్రామ వాలంటీర్లుగా అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తే.. దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయితే చాలామంది ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఎంతో ఇంతో నెలకు ఆదాయం వస్తుందని భావించారు. తీరా కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.