సార్!..మమ్మల్ని రోడ్డున పడేయొద్దు...మంత్రికి ఫార్మాడీ విద్యార్థుల వేడుకోలు
విజయవాడ: సార్!..లక్షలు ఖర్చు పెట్టి కోర్సు చదివాం...అనేక వైద్య రంగానికి సంబంధించి అనేక అంశాల్లో శిక్షణ పొందాం...కానీ వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలే లేవు...మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ తగిన ఉపాధి లభించడం లేదంటూ...మా బతుకులు రోడ్డుపై పడేయోద్దంటూ మంత్రి కామినేని శ్రీనివాస్ని ఫార్మాడీ విద్యార్థులు మొరపెట్టుకున్నారు. విజయవాడలో ఫార్మాడి విద్యార్థుల ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మంత్రి గారూ!...ఒక్కొక్కరం ఆరేళ్ల కోర్సుకు కలిపి 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టాం. అర్హులకు ప్రభుత్వం బోధనా రుసుముల చెల్లింపు కింద రూ.3.84 లక్షల రూపాయల వరకు చెల్లించింది. ఆరేళ్ల వ్యవధి కలిగిన ఫార్మాడీ కోర్సులో అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ వంటి అంశాలపై అవగాహన పొందాం. ద్వితీయ సంవత్సరం నుంచి ఆస్పత్రుల్లో వైద్యుల పక్కనే ఉంటూ వైద్య సేవల్ని అందించాం. మాకు ఇప్పుడు ఎక్కడా ఉపాధి దొరకని పరిస్థితి ఉంది...మీరే మాకు బతకడానికి దారి చూపించాలంటూ మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఆయన ఇంటికి వెళ్లి మరీ ఫార్మాడీ విద్యార్థులు వేడుకోవడం కలకలం సృష్టించింది.
అనుమతి...కోర్సు ప్రారంభం
2010లో ఫార్మా డి కోర్సును ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. ప్రతి ఏడాది రెండువేల మంది చొప్పున ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18వేల మంది చదువుతున్నారు. అయితే ప్రస్తుతం కోర్సు పూర్తిచేసుకున్నవారికే ఉపాధి లేని పరిస్థితుల్లో, వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కోర్సులో చేరాలనుకున్న వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
విద్యార్థుల మొర...మంత్రి స్పందన...
ఈ సందర్భంగా తనను కలసిన ఫార్మాడీ విద్యార్థులతో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...మీకు అవకాశం ఉన్నంత వరకు వైద్య ఆరోగ్య శాఖ (వైద్య మిత్ర, జనఔషధి)లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తానని''...చెప్పారు.
కమిటీ ఏర్పాటు...
ఫార్మా డి కోర్సు విషయమై మంత్రి కామినేని మాట్లాడుతూ...‘‘ఈ కోర్సు నిర్వహణ తీరు, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఎలా కల్పించాలన్న అంశాలపై చర్చించి నివేదికను అందచేసేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఒక నిర్దిష్ట ప్రణాళిక అంటూ లేకుండా ఏర్పాటుచేసిన ఈ కోర్సువల్ల విద్యార్థుల నష్టపోతున్నారు. ఈ కోర్సు విషయమై 45రోజుల్లోగా కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అయితే...కోర్సు క్యాన్సిలేనా...
"సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్న ఈ కోర్సుకు వైద్య శాఖకు సంబంధంలేదు. రానున్న విద్యా సంవత్సరంలో కొత్తగా ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతులు ఇవ్వొద్దని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కోరాను".. అని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.