అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల ఫార్మాసిస్ట్ మాధవి మృతి
గుంటూరు: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మహిళా ఫార్మాసిస్ట్ బాలినేని మాధవి మృతి చెందారు. గత పదకొండేళ్లుగా ఆమె అమెరికాలో ఉంటున్నారు. బుధవారం రాత్రి ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు.
2004లో ఆమె విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. అనంతరం పెళ్లి చేసుకొని, భర్తతో కలిసి ఫ్లోరిడాలో ఉంటున్నారు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికి అక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదం ఫ్లోరిడా రాష్ట్రం ఒకాలాలో జరిగింది. మాధవి వయస్సు 39. గుంటూరు బాపట్ల వివేకానందకాలనీకి చెందిన ఆమె భర్త చేబ్రోలు తివిక్రమ్ చౌదరితో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. ఈ దంపతులిద్దరూ ఫార్మసిస్టులే.
బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒకాలా పట్టణం సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న దుర్ఘటనలో మాధవి మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి చెందిన విషయం తెలిసి బాపట్లలో తల్లిదండ్రులు సీతాదేవి, సాంబశివరావు కన్నీరుమున్నీరయ్యారు.
వారి ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. నిడుబ్రోలుకు చెందిన మాధవి తండ్రి బాలినేని సాంబశివ రావు సబ్ రిజిస్ట్రారుగా పని చేసి ఉద్యోగ విరమణ చేశాక బాపట్లలో స్థిరపడ్డారు. బాపట్ల ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ చదివిన మాధవి కొంతకాలం ఇదే కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు.