'రెండూ నిజం, ఇద్దరు సీఎంలు జైలుకెళ్లాల్సిందే': టీఆర్ఎస్పై జేపీ ఆగ్రహం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమేనని, అందులో మాట్లాడింది నిజమేనని, ట్యాపింగ్తో పాటు ఓటుకు నోటు వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లవలసిందేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సోమవారం అన్నారు.
ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఒకరు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎదుటివారి గుట్టును తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే, మరొకరు నోట్లతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ పైన జేపీ ఆగ్రహం
పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు వ్యవహారాలకు వ్యతిరేకంగా కూకట్ పల్లిలో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ కార్యకర్తల పైన తెరాస కార్యకర్తలు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోక్సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
దాడికి పాల్పడిన తెరాస నేతల పైన పోలీసులు కేసులు పెట్టకుడా అధికార పార్టీకి ప్రయివేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.