ఏపీ బీజేపీ అనూహ్య చర్య - టీడీపీ సోషల్ యాక్టివిస్టుపై ఫిర్యాదు - జీవీఎల్పై అనుచిత వ్యాఖ్యలంటూ
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలపై ఫిర్యాదుల పరంపంర కొనసాగుతున్నది. ఇప్పటిదాకా ప్రతిపక్ష టీడీపీకి చెందిన పలువురిపై ప్రభుత్వం.. అధికార వైసీపీ సోషల్ సైన్యాలపై హైకోర్టు చర్యలకు ఆదేశించగా.. తొలిసారి బీజేపీ సైతం ఫిర్యాదులకు దిగింది. మూడు రాజధానులు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడుతోన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును ఉద్దేశించి టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు నమోదైంది.
టీడీపీకి చెందిన రామయ్య అనే వ్యక్తి 'జై తెలుగుదేశం', 'టీడీపీ యూత్' అనే పేర్లతో ఫేస్ బుక్ పేజీలు నిర్వహిస్తున్నాడని, ఆ పేజీల ద్వారా రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఏపీ బీజేపీ ఆరోపించింది. దీనిపై మంగళగిరి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారని కాషాయ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏపీ బీజేపీ ట్వీట్ చేసింది.
ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - 'కమ్మ'కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సోము వీర్రాజు సారధిగా నియమితులైన తర్వాత టీడీపీ విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరిస్తుండటం, చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు చేసే వివిధ ప్రకటనలపై వైసీపీ కంటే ముందుగానే బీజేపీ కౌంటర్లు ఇస్తుండటం తెలిసిందే. ఇప్పుడు జీవీఎల్ పై అనుచిత కామెంట్లు చేసిన వ్యక్తిపైనా పార్టీ పరంగానే ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఏపీని కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన కామెంట్లపై టీడీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో వైసీపీ, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయని, ఇరు పార్టీల నేతలూ ఒకే చోట తయారైన స్క్రిప్టును చదువుతున్నారని, కేంద్రానికి సంబంధం లేకుంటే కేసుల్లో ప్రతివాదిగా ఎందుకుందో జీవీఎల్ చెప్పాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.
Recommended Video
మూడు రాజధానులు, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో జీవీఎల్ చేస్తోన్న కామెంట్లు ఆయన వ్యక్తిగతమై ఉండొచ్చని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన మాటలు అసంబద్ధంగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అన్నారు. జాతీయ పార్టీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తాయని ఆయన గుర్తుచేశారు.