చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే నా తాపత్రయం..! కలెక్టర్ల సమీక్షలో ఏపీ సీఎం జగన్..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్: తాను చనిపోయిన తర్వాత తన ఫొటో ప్రతి ఇంట్లో పెట్టుకునేలా పనిచేయాలన్నదే తాపత్రయం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులో వైఎస్ జగన్ పలు ఆసక్తికర విషయాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అధికారులే కాపాడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో గౌరవం, అభిమానం పెరగాలన్నారు. ప్రతి సోమవారం ప్రతి ఆఫీసులో గ్రీవెన్స్సెల్ నిర్వహించాలని.. ఆ రోజు ఎలాంటి మీటింగ్లు పెట్టుకోవద్దని కలెక్టర్లకు సీఎం సూచించారు.
గ్రీవెన్స్సెల్కు ఎవరొచ్చినా ఒక రిసిఫ్ట్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ తీసుకోండని జగన్ సలహా ఇచ్చారు. మీ సమస్యను ఇన్నిరోజుల్లో పరిష్కరిస్తానని చెప్పండి ప్రజలకు హామీ ఇవ్వండని కలెక్టర్లకు జగన్ వివరించారు. వారానికి ఒక్కరోజు గ్రామాల్లో రాత్రి బస చేయండని.. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారాలన్నారు. విద్య, వైద్యం, రైతులే మా ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.
నవరత్నాల మీద ఫోకస్..! కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఆదవేశాలు..!!
ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు వస్తే చక్కగా రిసీవ్ చేసుకోవాలని, ఎమ్మెల్యేలను.. ప్రజలను చక్కటి నవ్వుతో పలకరించాలన్నారు. ఎంతటివారైనా సరే అవినీతి.. దోపిడీని ఈ ప్రభుత్వం సహించదని జగన్ స్పష్టం చేశారు. అవినీతి, దోపిడీ విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యేలకే ప్రయార్టీ ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేయాలన్నారు. ఈ వర్గాలకు సమాజంలో ఆత్మగౌరవం పెరిగేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వర్గాల కోసమే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు.
పథకాల అమలులో అలసత్వం వద్దు..! కలెక్టర్లకు దిశానిర్దేశం..!!
పథకాల అమలు పార్టీ, కుల, మత, ప్రాంతాలకతీతంగా జరగాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా సరే.. ఎవరికైనా లబ్ది చేయొద్దంటే వారి మాటలను పక్కన పెట్టాలన్నారు. వైసీపీకి ఓట్లేయని వాళ్లయినా సరే అర్హత ఉంటే పథకాల లబ్ది చేకూరుస్తామని జగన్ చెప్పారు. అందరికీ పథకాల లబ్ది చేకూరితే వచ్చే ఎన్నికల్లో వాళ్లే ఓట్లేస్తారని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తున్నామని, గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ఉండాలని, అవినీతి లేకుండా చేసేందుకే గ్రామ వాలంటీరుకు నెలకు 5 రూపాయల వేల వేతనం ఇస్తున్నామని అన్నారు. గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తే.. వెంటనే చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.
ప్రజావేదిక గురించి షాకింగ్ విషయాలు చెప్పిన వైఎస్ జగన్..! అక్రమ నిర్మాణాలు తప్పవన్న సీఎం..!!
గత కొన్ని రోజులుగా ప్రజావేదిక గురించి అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై సోమవారం ఉదయం ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్ట్ అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారని.. రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసినవారికి కాంట్రాక్టులు ఇస్తామని ఈ సందర్భంగా జగన్ తేల్చిచెప్పారు. ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని.. అక్రమంగా నిర్మించిన భవనంలో సమావేశం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణం కాదన్నారు. ఈ ప్రజావేదిక అవినీతితో కట్టిన భవనం అని ముఖ్యమంత్రి చెప్పారు. మన ప్రవర్తన ఎలా ఉండాలని తెలిపేందుకే ఇక్కడకు పిలిచానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్ అని.. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలవుతుందని జగన్ తేల్చిచెప్పారు. అయితే జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.