జగన్ను ఏకేసిన బాబ్జీ, తెరపైకి రవితేజ! (పిక్చర్స్)
విశాఖ: వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీనియర్ల ఫోబియా పట్టుకుందని, పార్టీలో పెద్ద నేతలు వుంటే ఎక్కడ తన కుర్చీలాగేసుకుంటారోనని ఆత్మన్యూనతాభావం ఆవహించినట్టుందని, అందుకే పార్టీలో పెద్దలన్నా, బలమున్న నాయకులన్నా కనీసం గౌరవించరని, వారిని ఎలాగోలా బయటకు పంపేయాలని ఆలోచిస్తుంటారని, కార్యకర్తలను నమ్మరని, సలహాదారులను నమ్మరని, నాయకులను నమ్మరని, చివరకు అతనిపై అతనికే నమ్మకం వుండని పరిస్థితి వస్తుందని గండి బాబ్జి మండిపడ్డారు.
తనను అభిమానించే వారి కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాణం పెడితే, జగన్ అలాంటివారిని తన కోసం బలితీసుకుంటాడని విరుకుచుపడ్డారు. నగరంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ జగన్పై దుమ్మెత్తిపోశారు. జగన్ వ్యవహారశైలికి నిరసనగా తనతోపాటు కొణతాల అనుచరులు మూకుమ్మడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
గండి బాబ్జీ
పార్టీలో పెద్దనేతలు వుంటే తన కుర్చీని ఎక్కడ లాగేసుకుంటారోనని భయం వల్లో ఏమోగానీ వారిని బయటకు పంపేయాలని నిర్ణయించుకున్నారన్నారు. విజయలక్ష్మిని ఎంపీగా విశాఖలో పోటీకి నిలపవద్దని కొణతాల చెప్పారన్నారు. విశాఖలో పరిస్థితి బాగోలేదని, గెలవడం కష్టమని హెచ్చరించినప్పటికీ వినకుండా పోటీకి నిలిపారన్నారు. అయినప్పటికీ విజయలక్ష్మి గెలుపు కోసం కొణతాల తీవ్రంగా కృషిచేస్తే, తన తల్లి ఓటమికి మీరే కారణమంటూ కొణతాలను అవమానించారన్నారు.
గండి బాబ్జీ
నాయకులు ఏదైనా తప్పుచేసినట్టయితే పార్టీ అధినేతగా వారిని పిలిపించి వివరణ అడగాల్సిందిపోయి, ఎవ రెవరి వద్దో ప్రస్తావిస్తూ వెటకారంగా మాట్లాడడం జగన్కే చెల్లిందన్నారు. నాయకులను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే భావన జగన్కు ఏ కోశానా లేదన్నారు. ఎన్నికల తర్వాత నుంచి కొణతాలతోపాటు తనపై జగన్ ఎందుకనో కక్షసాధింపునకు పూనుకున్నారని ఆరోపించారు.
వైయస్ జగన్
అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల ఇన్చార్జులను మార్చేయాలని ఆయనతోపాటు కారులో కూర్చునే నేతలతో పేర్కొనేవారన్నారు. తమనే మార్చాలని అనుకుంటే తమకంటే ఎక్కువ తేడాతో ఓటమిపాలైన నేతలందరినీ మార్చాల్సి వుందన్నారు. అయినప్పటికీ తమ పైనే ఎందుకు కక్ష కట్టారో అర్థం కాలేదన్నారు. తుఫాన్ సమయంలో తాము ఆయన పర్యటనలో కనిపించలేదనే కారణం చూపి పార్టీ నుంచి, పదవి నుంచి తప్పించడం సరైన కారణం కాదన్నారు.
గంటా తనయుడు
తుఫాను సమయంలో నగర ప్రజలకు విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నవంబర్ రెండున ఆకాశదీపాలు వెలిగించనున్నట్లు మంత్రి గంటా తనయుడు, గంటా నారాయణమ్మ మెమోరియల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు గంటా రవితేజ తెలిపారు. రెండో తేదిన సాయంత్రం 5 గంటలకు ఆర్కే బీచ్లో విశాఖ పునర్నిర్మాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఢతలు తెలియజేస్తూ స్కైలాంతర్లు విడిచిపెడుతున్నట్లు రవితేజ చెప్పారు. అనంతరం అభినందన సత్కారం నిర్వహిస్తామన్నారు.
కొణతాల అభ్యంతరం చెప్పినప్పటికీ ఆయనకు రాజకీయంగా బద్ధ శత్రువైన దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకున్నారన్నారు. దాడి రాక వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించినప్పటికీ ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు. కొణతాల మాటకు గౌరవం ఇవ్వకపోయినప్పటికీ మౌనంగానే భరించామన్నారు. చివరకు కొణతాల హెచ్చరించినట్టే ఎన్నికల అనంతరం పార్టీని విడిచి దాడి, అతని కుమారుడు వెళ్లిపోయారన్నారు.
ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వకుండా నచ్చినవ్యక్తికి టిక్కెట్ కేటాయించారన్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితికి జగనే కారణమని ఆరోపించారు. జగన్ దీనిని ఆహ్వానించకుండా ఇతరులపైకి నెట్టేసేందుకు యత్నిస్తున్నారన్నారు. పార్టీని నమ్ముకుని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా నష్టపోయారని, దీనికి జగన్ పశ్చాత్తాపపడాల్సిందిపోయి తనకు గిట్టని నేతలపై కక్షసాధింపునకు దిగడం విచారకరమన్నారు. జగన్కు పెద్దలంటే గౌరవం లేదన్నారు.