ఆగని దోపిడీలు: చెన్నై ఎక్స్ప్రెస్ ప్రయాణికుల పిక్చర్స్
గుండటూరు/ తిరుపతి: రైలులో దోపిడీ ఆగడం లేదు. చెన్నై ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీని మరిచిపోకముందే తిరుపతి ప్రత్యేక రైలు పద్మావతి ఎక్స్ప్రెస్లో దోపిడీ జరిగింది. మహిళల బంగారు ఆభరణాలను దోచుకుని దుండగులు పరారయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద దుండగులు తమను దోచుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలును చైన్ లాగి నిలిపిన సుమారు 10 మంది దొంగలు నాలుగు బోగీలలో మహిళల వద్ద బంగారు గొలుసులు, విలువైన ఆభరణాలు లాక్కెళ్ళారు. పిడుగురాళ్ల నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే చైన్ లాగటంతో డ్రైవర్ రైలును నిలిపివేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ పరిధిలో దోపిడీ జరిగిన విషయం విదితమే.
దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నించామని, రైలు నుంచి కిందకు దిగితే ఎంతమంది ఉంటారోనని భయపడ్డామని చెన్నైకి చెందిన దేవదాస్ చెప్పాడు. రైలు ఆగిన తరువాత రెప్పపాటులోనే దొంగలు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు.
రైలు దోపిడీ బాధితులు
చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీకి గురైన ప్రయాణికులు సికింద్రాబాదు రైల్వే స్షేషన్లో దిగిన తర్వాత ఫిర్యాదు చేశారు.
చైన్ లాగి దోపిడీ చేశారు
చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో దాదాపు 20 మంది మహిళల వద్ద విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దోపిడీ జరిగిన సమయంలో రైలులో పోలీసులు కనిపించలేదు.
20 నిమిషాల పాటు దోపిడీ
సుమారు 20 నిమిషాల పాటు రైలును ఆపి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితులు వీరే
చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాదు ఫతేనగర్కు చెందిన సంగీత మెడలోని 12 గ్రాముల నగలు, బౌద్ధనగర్కు చెందిన పుష్పలత మెడలోని 17 గ్రాముల నగలు, యూసుఫ్గూడకు చెందిన లక్ష్మి మెడలోని ఏడున్నర తులాల నగలు, నివేదన మెడలోని 20 గ్రాముల బంగారు నగల్ని దొంగలు లాక్కెళ్ళారు.