దంచికొడుతున్న వేడిగాలులు: మగాళ్లూ స్క్వార్ఫ్లతో... (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత, వడగాలుల తాకిడి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. హైదరాబాదు మండిపోతోంది. రోడ్లు భగ్గుమంటున్నాయి. రోడ్డు మీదికి ఎక్కితే చాలు, వేడి గాలి తాకి ఊపిరాడనీయడం లేదు. కానీ, పనుల మీద బయటకు వెళ్లక తప్పదు. హైదరాబాదీలు ముఖాలకు, తలలకు వస్త్రాలు చుట్టుకుని వాహనాలపైనా, కాలినడకన సాగుతున్నారు.
ఇంతకు ముందు అమ్మాయిలు షో కోసమో, మరెందుకో స్కార్ఫ్ప్లు ధరించేవారు. ఇప్పడు సూర్యుడి తాపంనుంచి రక్షించుకోవడానికి మగాళ్లు కూడా స్క్రార్ఫ్లు ధరిస్తున్నారు. వాటితో ఎండ నుంచి, వేడి గాలుల నుంచి రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదువడంతో ఇప్పటికే నగరంలో పలువురు వడదెబ్బతో మృతి చెందిన సంఘటనలు కూడా జరిగాయి. కానీ మండిపోతున్న ఎండలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించాయి.
తగ్గిన పగటి ఉష్ణోగ్రత
సోమవారం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 41 డిగ్రీలు, కనిష్ఠంగా 36 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అయినా వడగాలుల తీవ్ర ఆగలేదు. దాంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
నిప్పుల కొలిమిలా..
మధ్యాహ్నం పూట నగరం నిప్పుల కొలిమిని తలపిస్తున్నందున ఇంటి నుంచి బయటకొచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఎండలోనే తిరగాల్సిన వారు కాస్త జాగ్రత్తలు పాటిస్తూ తమ రాకపోకలు సాగిస్తున్నారు.
ఎనిమిది గంటల నుంచే..
సోమవారం కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతూ, వేడి గాలులు వీస్తున్నందున పనులపై వెళ్లే వారు ఉదయం వాతావరణం కాస్త చల్లగా ఉన్నపుడే తమ కార్యాలయాలను చేరుకుంటున్నారు.
మార్గాల అన్వేషణ
వడ దెబ్బ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొబ్బరి బొండాం, శీతలపానియాలు, పండ్ల రసాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
మరో నాలుగైదు రోజులు..
మున్ముందు మరో నాలుగైదు రోజుల పాటు వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే పరిస్థితులున్నట్లు అధికారులు తెలిపారు. ఏసిలు, కూలర్లు తమకేం అవసరమా అని వ్యాఖ్యానించిన వారు సైతం ఈ సారి రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో కూలర్లు కొనుగోలు చేయాల్సిన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
శతకోటి ఉపాయాల్లో
ఎండ నుంచి రక్షించుకునేందుకు శతకోటి ఉపాయాల్లో తలలకు, ముఖాలకు వస్త్రాలు ధరించడం కూడా ఓ ఉపాయంగానే ముందుకు వచ్చింది. వేడి గాలులు చుర్రున తాకుతుండడంతో ఆ వస్త్రాలు కాస్తా రక్షణగా పనిచేస్తున్నాయి.
కొనసాగుతున్న వేడిగాలులు..
తెలుగు రాష్ర్టాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ వేడిని తాళలేక అల్లాడుతున్న తెలుగు రాష్ర్టాలను రోహిణీకార్తె మరింత భయపెడుతోంది. రోహిణీకార్తె మొదలు కావడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారబోతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో..
కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాదు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాకపోవచ్చు. రోడ్లు మండిపోతున్నాయి.
గొడుగులు రక్షిస్తాయా..
మహిళలు గొడుగులు ధరించి సూర్యతాపం నుంచి రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వేడి గాలులు మాత్రం ఉడికిపోయినట్లు దేహాలను తాకుతూనే ఉన్నాయి.
టూవీలర్ మీద...
హైదరాబాద్ ప్రజలు చాలా మంది ద్విచక్రవాహనాలను వాడుతారు. టూవీలర్లపై ప్రయాణించేవారు ముఖాలకు, తలలకు వస్త్తాలు చుట్టుకుని సర్రున దూసుకొచ్చే వేడి గాలుల నుంచి రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.
హెల్మెట్లు బయటకు...
గత కొంత కాలంగా మూలన పడేసిన హెల్మెట్లను ద్విచక్రవాహనదారులు బయటకు తీశారు. వాటిని ఎండ నుంచి రక్షించుకోవడానికి ధరిస్తున్నారు. అవి కూడా వేడెక్కి తీవ్రమైన తాపాన్ని కలిగిస్తున్నాయి.
స్క్వార్ఫ్లతో అమ్మాయిలు..
అమ్మాయిలు ఎందుకో గానీ గత కొంత కాలంగా స్క్వార్ఫ్లు ధరించడాన్ని అలవాటు చేసుకున్నారు. ఇంతకు ముందు ఎందుకైనా గానీ ఇప్పుడు మాత్రం అవి ఎండ నుంచి, వేడి గాలి నుంచి రక్షిస్తున్నట్లే ఉన్నాయి.
నెత్తి మీద వస్త్రం..
గతంలో నెత్తి మీద టవల్ వేసుకోవడం నామోషీ. ఆధునిక నగర జీవితానికి అది చిన్నతనంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఎండ నుంచి, వేడి గాలుల నుంచి రక్షించుకోవడానికి అదే రక్షణగా మారింది.