కెసిఆర్ బిజీ: 24 వాటర్ గ్రిడ్లు, భీం స్మారకం (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇంటింటికి మంచి నీరు అందించాలన్నది తన కలగా ముఖ్యమంత్రి చెప్పారు. కలను సాకారం చేయడానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సచివాలయంలో సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కె జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్తో వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై చర్చించారు.
రాష్టవ్య్రాప్తంగా వాటర్ గ్రిడ్ ద్వారా నీరు అందించాలంటే లక్ష 26 వేల 36 కిమీ పొడవున పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇది భూమి చుట్టుకొలత కంటే నాలుగు రెట్లు ఎక్కువని ముఖ్యమంత్రి చెప్పారు. అంతటి భారీస్థాయిలో పైపులైన్ ద్వారా తాగునీరు అందించగలిగితే అది ప్రపంచ రికార్డే అవుతుందన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందించాలంటే మెయిన్ ట్రంక్లైన్ 5,227 కిమీ, సెకండరీ పైపులైన్ 45,809 కిమీ, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్ 75 వేల కిమీ వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రాజెక్టు మొత్తానికి రూ.27 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్రంలోని ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి వాటర్ గ్రిడ్లను నిర్మించి అక్కడి నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు అందించవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలకు గోదావరి, కృష్ణానదీ జలాలను అందించాలంటే 24చోట్ల వాటర్ గ్రిడ్లను నిర్మించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి తెలంగాణలోనే ఎత్తయిన ప్రదేశమని, అక్కడి వరకూ ఎత్తిపోతల ద్వారా నీరు తీసుకెళ్లగలిగితే చాలావరకూ పల్లపు ప్రాంతాలకు నీరు అందించవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ఇలాంటి ఎత్తయిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, హన్మకొండలో పద్మాక్షిగుట్ట, సిద్ధిపేటలో గుడ్డేలుగుల గుట్టలాంటి ప్రదేశాల్లో వాటర్ గ్రిడ్ల ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు.
హైదరాబాద్ కాకుండా...
హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణవ్యాప్తంగా 80 టిఎంసిల నీరు అవసరం అవుతుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. గోదావరి ఎత్తిపోతల పథకంతో అయితే కొన్ని నెలలే నీటిని అందించగలదని, అదే కృష్ణామీదనున్న జూరాల, నాగార్జునసాగర్ అయితే శాశ్వత నీటి వనరులుగా ఉపయోగపడుతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
30 ఏళ్లకు సరిపడా..
ప్రతి ప్రాజెక్టులో విధిగా తాగునీటి అవసరాలు, పరిశ్రమల అవసరాలకు నీరు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి వ్యవస్థ, భవిష్యత్లో 30ఏళ్లకు అవసరమయ్యే తాగునీరు, పరిశ్రమలకు అవసరాలపై అధ్యయనం నిర్వహించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కొమురం భీం పేర
తెలంగాణలో జరిగే ప్రపంచ గిరిజన ఉత్సవాలు, భారతీయ గిరిజన సదస్సును కొమురం భీమ్ పేరిట నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొమురంభీమ్ వర్థంతి ఏర్పాట్లపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, జయధీర్ తిరుమలరావు తదితరులతో సోమవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు.
కొమురం భీం స్మారకం
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వ్యక్తి కొమురం భీమ్ అని, అంతటి గొప్ప వ్యక్తి చరిత్ర మనవాళ్లు తెలుసుకోలేనంతగా సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 200 ఎకరాలను సేకరించి కొమురం భీమ్ మెమోరియల్ను స్థాపిస్తామని, అక్టోబర్ 8న దానికి తానే శంకుస్థాపన చేస్తానని చెప్పారు.
టూరిజం సర్క్యూట్
ఉత్తరాఖండ్లోని జిమ్కార్బెట్ నేషనల్ పార్కు తరహాలో కొమురం భీమ్ నివసించిన ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ కేంద్రంగా టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొమురం భీమ్ జీవిత విశేషాలతో ఓ డాక్యుమెంటరీని రూపొందించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.
యూనివర్శిటీ కూడా..
కొమురం భీమ్ పుట్టి పెరిగిన ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కుంటాల జలపాతం, కవ్వాల్ అభయారణ్యం ప్రాజెక్టు తదితర దర్శనీయ స్థలాలు ఇప్పటికే జిల్లాలో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.