"చిరుకు బుద్ధి: లగడపాటి నపుంసకుడు" (ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు నిరసనగా సీమాంధ్రలో రెండో రోజు శనివారం కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులపై, పార్లమెంటు సభ్యులపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజనను అడ్డుకోలేని పార్లమెంటు లగడపాటి రాజగోపాల్ అసమర్ధుడు, నపుంసకుడని వ్యాఖ్యానిస్తూ ఆయనకు చీర, సారెలు ఇచ్చేందుకు బయలుదేరిన టీడీపీ తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం టీడీపీ భవన్ నుంచి ఎంపీ లగడపాటి నివాసానికి బయలుదేరుతున్న తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో తెలుగు మహిళలు, నాయకులు వాగ్వాదానికి దిగడంతో...తోపులాట జరిగింది. కాగా, తెలుగు మహిళల అరెస్ట్ను నిరసిస్తూ బంద్రోడ్డులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని కూడా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
కిల్లి కృపారాణి పోస్టర్ తొలగింపు..
రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనకారులు శుక్రవారం కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పోస్టరును శ్రీకాకుళంలో తొలగించారు.
ఎపి ఎన్జీవోల ఆందోళన
విశాఖపట్నంలో ఎపి ఎన్జీల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించారు.
బస్సులను నిరోధించారు..
విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. బస్సులను కదలనీయలేదు.
కలెక్టరేట్ వద్ద భద్రత
సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఇలా భద్రతా సిబ్బంది మోహరించారు.
కెజిహెచ్లో పరిస్థితి ఇలా..
మెడికల్ జెఎసి సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కెజిహెచ్లో శుక్రవారం పరిస్థితి ఇలా ఉంది. రోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.
న్యాయవాదుల ఆందోళన..
సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విశాఖపట్నంలో ఇలా ఆందోళనకు దిగారు. వారు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు ఆందోళన..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు విభజనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
తిరుపతిలో మోహరించిన పోలీసులు
సీమాంధ్ర బంద్ సందర్భంగా తిరుపతిలో శుక్రవారం పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో బంద్ జరిగింది.
టిడిపి కార్యకర్తలు కూడా..
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శుక్రవారం తిరుపతిలో ఆందోళనకు దిగారు. రోడ్డును బ్లాక్ చేశారు.
ఆందోళనకారులను తొలగిస్తున్న పోలీసులు
పోలీసులు శుక్రవారంనాడు తిరుపతిలో ఆందోళనకారులను తొలగించే పని చేపట్టారు. తిరుపతిలో ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించారు.
మెడికల్ జెఎసి ఆందోళన
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మెడికల్ జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర కావాలంటూ వారు నినదించారు.
కేంద్ర మంత్రి చిరంజీవి శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు వారంతా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న 'సి' బ్లాక్కు చేరుకున్నారు.
అయితే భద్రతా సిబ్బంది వారిని కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఉద్యోగులు 'సి' బ్లాక్ బారికేడ్లకు అవతల ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులపై సచివాలయ మహిళా ఉద్యోగులు సహా అందరూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి చిరంజీవిని ఉద్దేశించి.. "నీకు బుద్ధుందా? మమ్మల్ని రాజీనామాలు చేయమంటావా? నీలాగా పార్టీ పెట్టి టిక్కెట్లు అమ్ముకోలేదు. మేం కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాం. మమ్మల్ని రాజీనామా చేయమనడానికి నువ్వెవడివిరా?'' అంటూ మండిపడ్డారు.
"ఐదు సంవత్సరాలు దాటితే నువ్వు రోడ్డు మీద ఉంటావు. మేం 58 సంవత్సరాల వయసు వచ్చేంతవరకూ ఉద్యోగాల్లో ఉంటాం. కావూరి, కిల్లి కృపారాణి, పళ్లం రాజు.. ఎవరైనా కానీ రాజకీయ డాన్సులు వేస్తున్నారు'' అంటూ మండిపడ్డారు. పలు కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు.