కోస్తా తీరంలో అలల ఉధృతికి బెంబేలు (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా భిమిలీ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంగమారిపేటలో ఆదివారం రాత్రి అలల ఉధృతికి ఓ ఇంటితో పాటు పలు వృక్షాలు నేల కూలాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. మత్స్యకారుల సొసైటీ భవనంలో తలదాచుకున్నారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపల కంచేరుకు చెందిన జాలర్లు ఆదివారం సముద్రంలో వలలు వేసి వచ్చారు. అయితే, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. దీంతో వలల కోసం జాలర్లు సోమవారం సముద్రానికి వెళ్లారు. వలలు తీసుకుని వస్తుండగా అలల తాకిడికి నాలుగు బోట్లు బోల్తా పడ్డాయి.
ఓ బోటులోని కోల ఎల్లయ్య (48) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మరణించాడు. మైలపల్లి ముసలయ్య, మైలపల్లి రామన్న, దాసరి ఎర్రన్న గాయపడ్డారు. రెండు పడవలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.
అలల ఉధృతి
చేపలుప్పాడ వద్ద భిమిలీ - విశాఖ రోడ్డు వరకు సముద్రపు నీరు వచ్చి చేరింది. స్థానిక చేపలదిబ్బ డిపాలేనికి చెందిన సుందరమ్మ సముద్రపు నీటిలో చిక్కుకుంది.
అలల ఉధృతి
సోమవారం ఉదయం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంగవారి పేట తీరంలో ఉన్న నివాసాల వరకు సముద్రపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. సోమవారంనాడు సముద్రం అల్లకల్లోలంగా మారింది.
అలల ఉధృతి
భీమిలీ తీరం వద్ద ఉదయం ఆరు గంటల నుంచి అలలు బాగా ముందుకు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
అలల ఉధృతి
విజయనగరం జిల్లాలో నాలుగు పడవలు బోల్తా పడి ఓ జాలరి మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో 30 అడుగులు, శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో 120 మీటర్లు సముద్రం ముందుకు వచ్చింది.
అలల ఉధృతి
గోస్తనీనది సముద్రానికి కలిసే చోటుకు సమీపంలోని జోనల్ కార్యాలయం ఎదురుగా రక్షణ కోసం ఎర్రమట్టితో ఏర్పాటు చేసిన గట్టు నదీప్రవాహానికి తోడు అలలు ముందుకు రావడంతో కొట్టుకుపోయింది.
అలల ఉధృతి
గోస్తనీనది సముద్రంలో కలిసే చోట సముద్రం మరింత అల్లకల్లోలంగా మారింది. ఇక్కడి మత్స్యకారులు తమ పడవలను తాళ్లతో కట్టి వలలను భద్రపరుచుకున్నారు.
అలల ఉధృతి
కోస్తాతీరంలో ఉప్పాడ నుంచి అన్నవవరం వరకు తీరంలోని నీరు ఎర్రగా మారింది. విశాఖపట్నం తీరంలో కూడా సముద్రం అలల ఉధృతి పెరిగింది. ఈ ఆటుపోట్లతో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎదురుగా బంకరు ఒకటి బయటపడింది.
అలల ఉధృతి
గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో అలలు 15 అడుగుల మేర ఎగసిపడ్డాయి. సముద్రం 130 అడుగుల మేర ముందుకు వచ్చింది.
అలల ఉధృతి
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్ల పేట తీరంలో సముద్రం 120 మీటర్లు ముందుకు వచ్చింది. సుమారు 1.60 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైంది. తెప్పలు, వలలు కొట్టుకుపోగా ఒక బోటు బోల్తా పడింది.
అలల ఉధృతి
విశాఖలో రెండు రోజుల పాటు తీర ప్రాంతం భారీ కోతకు గురైంది. రామకృష్ణా బీచ్లో అలలు ముందుకు వచ్చాయి. మీటరు నుంచి రెండు మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి.
అలల ఉధృతి
జులై, ఆగస్టు నెలల్లో ఆర్కె బీచ్ నుంచి భిమిలీ వరకు ఇసుక కోతకు గురి కావడం సాధారణంగా జరుగుతున్నదేనని నిపుణులు అంటున్నారు.