హైదరాబాద్: ఒళ్లు గగుర్పొడిచే నేరాలు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఇటీవల దారుణమైన, కిరాతకమైన నేరాలు వెలుగు చూస్తున్నాయి. నేరాలు పెరిగాయా, అవి బయటపడడం ప్రారంభమైందా అనేది అనుమానంగా ఉంది. అయితే, అత్యంత భారీ దొంగతనాలు, ఘోరమైన అత్యాచారాలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ కేసుల్లోని నిందితులను పట్టుకుని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కడలూరి శివ అలియాస్ సాంబ హైదరాబాదులో చైన్ స్నాచింగులకు పాల్పడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న విషయం తెలిసి బయటి ప్రపంచం విస్తుపోయింది.
నకిలీ నోట్ల చెలామణిలో ఆరితేరాడని భావిస్తున్న ఎల్లంగౌడ్ తన ముఠాతో పోలీసులపై దాడి చేయడం, ఆ దాడిలో ఓ కానిస్టేబుల్ మరణించడం, ఓ పోలీసు అధికారి గాయపడడం తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాల తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఇటీవల జరిగిన రెండు అత్యాచార ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ 21 ఏళ్ల మహిళపై ఆమె భర్తను, మరిదిని నిర్బంధించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన దిమ్మతిరగడమే కాదు, తల దించుకునేలా ఉంది. స్నేక్ గ్యాంగ్ చేసిన అత్యాచారం గురించి చెప్పనే అక్కరలేదు. ఆ సంఘటనను తలుచుకుంటేనే ఒళ్ల గగుర్పొడుస్తుంది. కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి, యువతిని పాములతో బెదిరించి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన భీతావహంగా ఉంది.
ఆ నాలుగు సంఘటనలు ఇటీవలి కాలంలో హైదరాబాద్లో తీవ్ర సంచలనం సృష్టించగా, హవాలా రాకెట్లను ఛేదించడం, దొంగల ముఠాలను పట్టుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. నేరగాళ్లు బరితెగిస్తున్నారా, ఇంత కాలం కొనసాగిస్తూ వస్తున్న పాత నేరగాళ్ల చర్యలకు పోలీసులకు బ్రేకులు వేస్తున్నారా అనేది తెలియనంతంగా నేరాలు బయటపడుతున్నాయి. పాత నేరగాళ్లను, నిందితులను విడిచిపెట్టడం వల్లనే విచ్చలవిడిగా అత్యాచారాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారా అనే అనుమానం రాక మానదు.
బిగ్ బజార్ చోరీ
హైదరాబాదులోని కాచిగూడా క్రాస్ రోడ్స్లోని బిగ్ బజార్లో భారీ చోరీ జరిగింది. చోరీ కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 22, 23 తేదీల మధ్య అర్థరాత్రి కాచిగుడా క్రాస్ రోడ్స్లోని బిగ్ బజార్ షాపింగ్ మాల్లో దోపిడీ జరిగింది. 32 లక్షల 27 వేల 290 రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
ఎల్లంగౌడ్ అరెస్టు
కొద్ది రోజుల క్రితం హైదరాబాదు షామీర్పేట వద్ద నకిలీ కరెన్సీ ముఠా పోలీసులపై కాల్పులు జరిపి ఓ కానిస్టేబుల్ను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎల్లంగౌడ్ పైన తెలంగాణలో 15, కర్ణాటకలో 3 కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
స్నేక్ గ్యాంగ్
గత నెల 31న సరూర్నగర్ మండలం షాహిన్నగర్లోని ఒక ఫామ్హౌజ్కు ఇద్దరు ప్రేమికులు సరాదాగా వచ్చారు. ప్రేమజంటను గమనించిన స్థానిక యువకులు ప్రేమికుడిని బంధించి, అతన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందు పాముతో బెదిరించి వివస్తన్రు చేసి, సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించారు.
చందన బ్రదర్స్ చోరీ..
హైదరాబాదులోని కూకట్పల్లి చందన బ్రదర్స్ చోరీ కేసును పోలీసులు గురువారంనాడు చేదించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు పేరు మోసిన దొంగలను, ముగ్గురు రిసీవర్లను అరెస్టు చేశారు. ఈ నెల 7వ తేదీ అర్థ రాత్రి చందన బ్రదర్స్ దుకాణంలోకి ప్రవేశించి భారీగా బంగారాన్ని, రూ. 15 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే.
మంత్రి శంకర్ అరెస్టు
ఘరానా దొంగ మంత్రి శంకర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతను 250 కేసుల్లో నిందితుడు. ఇప్పటికే 209 కేసుల్లో అతనికి శిక్ష పడింది. 22 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మహరాష్ట్రలోని లాతూర్లో శివన్న పేరుతో మూడో భార్యతో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారిగా నటిస్తూ వస్తున్నాడు. మంత్రి శంకర్ రాత్రి పూట హైదరాబాద్లోని ఇళ్లలో దొంగతనాలు చేసి తిరిగి లాతూర్ వెళ్లిపోతూ వచ్చాడు.
కాల్పుల్లో శివ హతం
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కడలూరు శివ అలియాస్ సాంబ అనే చైన్ స్నాచర్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఇటీవల శంషాబాద్ సమీపంలోని కోత్వాల్గుడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన కాల్పుల్లో అతను హతమయ్యాడు.
హవాలా రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్లో గుట్టుచప్పుడు కాకుండా హవాలా దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ముఠా నుంచి 43 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బకుల్కుమార పటేల్ (34), జయేష్ పటేల్ (38) హవాలాను నడుపుతున్నట్లు గుర్తించారు.
స్కీమ్ల పేరుతో మోసాలు
మీరు స్కీంలో బంగారు ఆభరణాలను గెల్చుకున్నారని చెప్పి నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టురట్టయ్యింది.ముగ్గురు నిందితులను నగరంలోని సెంట్రల్ జోన్ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 13.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నగల కోసం..
బంగారు నగల కోసం అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు సికింద్రాబాదులోని అల్వాల్ ఇందిరానగర్ నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు చెవి దిద్దులు లాక్కోని బోయిన్పల్లిలో వదిలేసి వెళ్లిపోయారు.