జగన్ సమైక్యం: పనిగట్టుకుని ఇలా తిరిగారు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పనిగట్టుకుని దేశమంతా తిరిగి ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించారు. ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. జైలు నుంచి విడుదలైన వెంటనే నిరాహార దీక్ష చేపట్టిన ఆయన ఆ తర్వాత కోర్టు అనుమతులు పొందుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిశారు.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తోందని ఆయన జాతీయ పార్టీల నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారు. దానిపై విస్తృతంగా చర్చ జరగాలని, దాన్ని సవరించాలని, అందుకు సహకారం అందించాలని వివిధ పార్టీల నాయకులను కోరారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిపిఐ వంటి జాతీయ పార్టీల నాయకులను కూడా కలిసి ఆ పార్టీల మనసు మార్చే ప్రయత్నం చేశారు.
ఓట్ల కోసం, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ను విభజిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే దానితో ఆగిపోదని, ఇతర రాష్ట్రాలను కూడా ఓట్ల కోసం చీలుస్తారని ఆయన వివరిస్తూ వచ్చారు. ఆయనకు ఏ మేరకు మద్దతు లభించిందో గానీ ప్రస్తుతం సొంత పార్టీ నాయకులే యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన పర్యటనలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
ప్రణబ్తో ఇలా..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ జగన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిన అవసరంపై ఆయన ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం ఇచ్చారు.
గవర్నర్తో భేటీ..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కూడా కలిశారు.
సురవరంతో బేటీ...
వైయస్ జగన్ సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని ఢిల్లీలో కలిసి, రాష్ట్ర విభజనపై పునరాలోచన చేయాలని కోరారు. తాము తెలంగాణకు మద్దతు ఇస్తామని, ఆయితే ఆర్టికల్ 3 దుర్వినియోగం కాకుండా చూస్తామని సురవరం హామీ ఇచ్చారు.
కారత్ సహకారం..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మద్దతు వైయస్ జగన్కు లభించింది. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని కారత్ చెప్పారు.
తెలుగు నేత ఏచూరి మద్దతు..
సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తాము ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకమని, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామని జగన్తో కలిసి మీడియాతో చెప్పారు.
దేవెగౌడతో బేటీ..
మాజీ ప్రధాని, జెడి(ఎస్) అధినేత దేవెగౌడ మద్దతు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు లభించినట్లే ఉంది. ఆయన పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేవెగౌడతో సమావేశమయ్యారు.
అఖిలేష్ యాదవ్ తోడ్పాటు..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మద్దతు దొరికింది. తాము తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని అఖిలేష్ యాదవ్ జగన్తో చెప్పారు.
జయలలితతో భేటీ..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెన్నై వెళ్లి అన్నాడియంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
కరుణానిధితోనూ జగన్ భేటీ..
చెన్నై వెళ్లినప్పుడు ఆయన డిఎంకె అధినేత కరుణానిధిని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు జగన్ తెలిపారు.
శరద్ యాదవ్ ఎటూ తేల్చలేదు..
జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ మద్దతును వైయస్ జగన్ కోరారు. ఆయన ఆయన ఏదీ తేల్చలేదు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు తమ వైఖరిని ప్రకటిస్తామని శరద్ యాదవ్ జగన్తో చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ...
శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ముంబైలో జగన్ సమావేశమై ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటేయాలని కోరారు.
పవార్కు విజ్ఞప్తి..
రాష్ట్ర విభజన విషయంలో వైయస్ జగన్ ఎన్సీపి నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మనసు మార్చేందుకు వైయస్ జగన్ ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ అనుకూలంగా ఉన్నారు.
మమతా బెనర్జీ బాసట..
కోల్కతా వెళ్లి వైయస్ జగన్ తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి మద్దతు కోరారు. జగన్ తన తమ్ముడిలాంటివాడని మమత కురిపించారు.
రాజ్నాథ్ సింగ్తో జగన్ సమావేశం..
బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా వైయస్ జగన్ కలిసి వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
నవీన్ పట్నాయక్తో సమావేశం..
ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ నేత నవీన్ పట్నాయక్కు భువనేశ్వర్లో జగన్ కలిశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆయన కోరారు.