ఘోరం: మహిళపై దాడి చేసి, ఈడ్చుకెళ్లిన పందులు, తీవ్రగాయాలు (వీడియో)
నెల్లూరు: జిల్లాలోని కావలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లున్న వృద్ధురాలైన ఓ మహిళపై దాడి చేసిన పందులు.. ఆమెను కిందపడేసి కొరికేశాయి. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పందులను రాళ్లతో కొట్టి తరిమేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కావలిలోని వైకుంఠపురం ప్రాంతానికి చెందిన షేక్ బీబీజాన్ అనే మహిళ పలు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. శుక్రవారం అయ్యప్పస్వామి గుడి పక్కవీధిలో నడిచి వెళ్తుండగా ఓ పందుల గుంపు ఆమెపై దాడి చేసింది.
కిందపడ్డ ఆమెను రెండు పందులు ఈడ్చుకుంటూ వెళ్లాయి. గమనించిన స్థానికులు కేకలు వేసిన ప్రయోజనం లేకపోవడంతో రాళ్లతో కొట్టి పందులను తరిమేశారు. వెంటనే 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పందుల దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, పందులు ఈ విధంగా దాడి చేయడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. పందులు స్థానికంగా ఎక్కువగా ఉన్నాయని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.