టీటీడీ వివాదాలపై గుజరాత్ హై కోర్టులో పిల్:శ్రీవారి లడ్డూ పోటులో ప్రమాదం
Recommended Video
తిరుమల: మరోసారి టిటిడి వార్తల్లోకెక్కింది. పురవాస్తు శాఖ వ్యవహారంతో సహా వివిధ ఆరోపణల నేపథ్యంలో టీటీడీని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలంటూ గుంటూరుకు చెందిన అనిల్, గోస్వామి అనే వ్యక్తులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
టీటీడీ ఆదాయం, ఆభరణాల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వీరు అక్కడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నేలమాళిగలు, గుప్త నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తమ పిల్ లో పిటిషనర్లు కోరారు. టీటీడీ పురాతన కట్టడాలపై మే 4న కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖను తిరిగి పునరుద్ధరించాలని కూడా పిటిషనర్లు తమ వ్యాజ్యంలో కోరడం గమనార్హం.
ఇదిలావుండగా తిరుమల శ్రీవారి లడ్డూ పోటులో సోమవారం ఉదయం ఓ ప్రమాదం చోటుచేసుకుంది. బూందీ, చక్కెర , జీరా కలిపే యంత్రంలోని గేరు బాక్సు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో ఓ కార్మికుని చెయ్యి విరిగింది. ఆలయం బయట ఉన్న పోటులో తయారయ్యే బూందీని ఆలయం లోపలున్న పోటులోకి తరలించి అక్కడ సిద్దంగా ఉంచిన ప్రత్యేక యంత్రంలో చక్కర జీరాతో కలుపుతారు.
రోజూలాగే సోమవారం ఉదయం కార్మికులు వాటిని కలిపే ప్రక్రియలో నిమగ్నమై ఉండగా గేర్ బాక్సు విరిగి ఒక కార్మికుని చేతిపైన పడింది. ఆ బరువు ధాటికి అతని చెయ్యి ఎముక రెండుగా విరిగినట్లు తెలుస్తోంది. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.