ఆ విధంగా వేల కోట్ల అవినీతి పాల్పడ్డారు!...చంద్రబాబు, లోకేష్ లపై హైకోర్టులో పిల్
Recommended Video
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్, ఏపీఎన్నార్టీ సీఈవో వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 2014 నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిల్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు పర్యావరణంపై మాట్లాడటం...దెయ్యాలు వేదాలు వల్లించడమే!:కన్నా లక్ష్మీనారాయణ
అర్హతలేని షెల్ కంపెనీలకు రూ.కోట్ల విలువచేసే భూములను కేటాయించడం, వాటికి నిబంధనలకు విరుద్దంగా పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది జాడ శ్రావణ్కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విధంగా క్విడ్ ప్రో కో పద్ధతిలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని ఫిర్యాదిదారుడు పేర్కొన్నారు.
అవినీతిపై...హైకోర్టులో పిల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ క్విడ్ ప్రో కో(మీకిది మాకది)కు పాల్పడుతూ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని...వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం కాగితాలకే పరిమితం అయిన కంపెనీలకు అత్యంత ఖరీదైన వేల ఎకరాల భూములను సిఎం చంద్రబాబు,మంత్రి లోకేష్ కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ అక్రమాలకు...అతడే కీలకం
ఈ అక్రమాలకు అధికారికంగా సిఎం చంద్రబాబు, లోకేష్...తెరవెనుక కీలకపాత్రధారిగా ఎపి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) సిఇవో వేమూరి రవికుమార్ ఉన్నారని జె.శ్రవణ్కుమార్ పిల్లో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఒక ఐటి పాలసీని రూపొందించి ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏపీఎన్ఆర్టీ ద్వారా వచ్చిన ఫైళ్లను సత్వరమే క్లియర్ అయ్యేలా చట్టంలో మార్పులు చేసి ఎన్నో కంపెనీలను ఆకర్షించేలా చేసి ఈ మోసానికి తెర తీశారన్నారు. ఇలా పెట్టుబడులు పెట్టే సంస్థల నుంచి సిఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లకు ముట్టాల్సిన ముడుపులు తేలిన తర్వాతే ఏపీఎన్నార్టీ క్లియరెన్స్ ఇస్తోంది అని పిటిషనర్ వివరించారు.
60 వేల ఎకరాలు...ధారాదత్తం
విశాఖలో ఎకరం రూ.15 కోట్ల విలువైన భూమిని రూ.3.5లక్షలకు ఇలాంటి కంపెనీలకు కట్టబెట్టారని, ఇలా రూ.500 కోట్ల విలువైన 40 ఎకరాల్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవా సొల్యూషన్స్కు ధారాదత్తం చేశారన్నారు. ఇంత ఖరీదైన భూమి ఇచ్చేందుకు విధించిన షరతులు విస్తుపోయేలా ఉన్నాయని పిల్లో పేర్కొన్నారు. రెండున్నర వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీపై ప్రభుత్వ అజమాయిషీ ఏమీ ఉండదని, భూమిని అమ్ముకునేందుకు ఆ కంపెనీకి అధికారం వచ్చేస్తుందని వివరించారు. ఒక టిడిపి నేతకు చెందిన వీబీసీ ఫెర్టిలైజర్స్ కంపెనీకి రూ.100 కోట్ల విలువైన భూమి ఇలాగే ఇచ్చేశారన్నారు. ఏపీఐఐసీ 57, 836 ఎకరాలను వివిధ కంపెనీలకు ఇచ్చేసిందని, అలా ఏ కంపెనీకి ఎంత భూమి ఇచ్చారో అనే వివరాలను సమాచార హక్కు చట్టం కింది కోరినా ఇవ్వడం లేదన్నారు.
అన్నీ తప్పుడు లెక్కలు...అందుకే గోప్యం!
లోకేష్ మంత్రి అయ్యాక ఎన్నారై వేమూరి రవికుమార్ ఆయనకు సలహాదారుడిగా మారగా, ఆ తరువాత ఏపీఎన్ఆర్టీకి చైర్మన్ గా పదవి కట్టబెట్టారని తెలిపారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ కల్పన పేరుతో కాగితాలకే పరిమితమైన షెల్ కంపెనీలకు అత్యంత ఖరీదైన భూములు కేటాయించేశారని...వారు ఉద్యోగ కల్పన చేసినట్లుగా తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. నిజానికి వేలల్లో కాదు కదా వందల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని...అందుకే వెబ్సైట్లో ఆ వివరాలేమీ లేకుండా అంతా గుట్టుగా ఉంచారన్నారు. వివరాలు వెబ్సైట్లో పొందుపరిస్తే ఈ మోసాలు తెలిసిపోతాయని పెట్టడం లేదన్నారు.
సిబిఐ,ఈడీ విచారణ...కావాలి
టిడిపి అధికారంలోకి వస్తే ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారని...పాలన చేతికి రాగానే కాగితాల కంపెనీలకు భూకేటాయింపులు చేసేందుకు వీలుగా...ఉన్న చట్టాల్ని అందుకు అనువుగా మార్చేశారన్నారు. ఉద్యోగ కల్పన పేరుతో నారా లోకేష్, వేమూరి రవికుమార్లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని...చంద్రబాబు, లోకేష్ల తరఫున రవికుమారే మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలంటూ శ్రావణ్ కుమార్ పిల్లో హైకోర్టును కోరారు. ఇందులో నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, ఐటీ శాఖ మాజీ మంత్రి పల్లె రఘునాఎద్రెడ్డి, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) సీఈఓ వేమూరి రవికుమార్ లను వ్యక్తిగత ప్రతివాదుల్ని చేశారు.