తరచూ బ్యూరోక్రాట్ల బదిలీలపై ఏపీ కోర్టులో పిల్ దాఖలు.. కోర్టు ఏం చెప్పిందంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బ్యూరోక్రాట్లు ఒక్కటయ్యారా..? మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అకస్మిక బదిలీతో మనసునొచ్చుకున్నారా... అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అక్కడ హాట్టాపిక్గా నిలిచింది. ఒక శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆ శాఖలో సరిగ్గా కుదురుకోక ముందే మళ్లీ బదిలీ చేయడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ అసంతృప్తే కోర్టులో పిల్ వేసే వరకు దారి తీసింది.
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే బ్యూరోక్రాట్లకు ఆయా శాఖల్లో ఒక పరిమిత కాలం వరకు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ కోర్టులో ప్రజాప్రయోజనవాజ్యం (పిల్) దాఖలైంది. తరచూ బదిలీలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు బ్యూరోక్రాట్లు. అయితే కోర్టు ఈ పిటిషన్ను డిస్మిస్ చేసినట్లుగా సమాచారం. అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం అకస్మిక బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ అంశాన్నే ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని.. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే మాజీ చీఫ్ సెక్రటరీ బదిలీతో ఎలాంటి సంబంధం లేదని పబ్లిక్ సర్వెంట్లను ఒక శాఖకు కొంతకాలం వరకు పరిమితి చేస్తే కెరీర్ పరంగా ఎదిగే అవకాశాలు ఉండటంతో పాటు నైపుణ్యత కూడా పెరుగుతుందని కొందరు అధికారులు తెలిపారు. అంతే తప్ప ఇలా తక్కువ సమయంలో ఎక్కువ బదిలీలు చేయడం వల్ల కెరీర్ అడ్వాన్స్మెంట్లో నైపుణ్యత అనుభవంతో పాటు, చాలా కోల్పోతున్నామనే ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మంచి ప్రభుత్వ పాలన ఇవ్వాలంటే ఒక బ్యూరోక్రాట్ను కనీసం రెండేళ్లు పాటు ఒకే శాఖకు పరిమితం చేయాలని, చీఫ్ సెక్రటరీ విషయంలో కూడా ఇది వర్తించాలని పిటిషన్లో కోరినట్లు సమాచారం. అయితే ప్రజాప్రయోజనవాజ్యం పిల్ను కోర్టు కొట్టివేసింది.