సీఆర్డీఏ రద్దు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం హీట్ను పెంచుతోంది. సోమవారం రోజున సీఆర్డీఏ రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. సీఆర్డీఏ రద్దు చట్టంను వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏపై రద్దు చట్టం పై హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై మధ్యంతర స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇక పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం, మంత్రులను ప్రతివాదులుగా చేర్చడం జరిగింది.
అమరావతి రాజధాని రైతులు రాజధానిని తరలించడంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారణ చేయనుంది. ఏపీ రాజధానిగా ముందుగా నిర్ణయించినట్లుగా అమరావతే ఉండాలని పిటిషన్లో 37 మంది రైతులు కోర్టును కోరారు. మరోవైపు మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గుంటూరు కృష్ణా జిల్లాల్లో స్వచ్ఛదంగా బంద్ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గేవరకు పోరాటం ఆగదని విద్యార్థి నేతలు చెప్పారు.
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడురోజుల పాటు నిర్వహిస్తోంది. సోమవారం సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి సుదీర్ఘ చర్చ తర్వాత శాసనసభ ఆమోదం తెలిపింది. అయితే మండలిలో మాత్రం ప్రభుత్వంకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇక మండలిలో ఈ రోజు కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇక మండలిలో బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా మూడు నెలల పాటు అడ్డుకోవచ్చే వ్యూహంతో టీడీపీ వ్యవహరిస్తోంది.