అమరావతి పిటిషన్ల విచారణ లైవ్- హైకోర్టులో పిల్- కోర్టుపై బురదజల్లకుండా ఉండేందుకేనంటూ..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది. నిన్న మొన్నటివరకూ క్రమం తప్పకుండా జరిగిన విచారణ తాజాగా వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. అయితే అదే సమయంలో హైకోర్టులో రాజధాని పిటిషన్లపై జరుగుతున్న విచారణపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ, దాన్ని నివారించాలంటే ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. బనారస్ యూనివర్శిటీలో ఎల్ఎల్ఎం విద్యార్ధి అయిన విజయవాడ వాసి వేమూరు లీలాకృష్ణ ఈ పిల్ దాఖలు చేశారు.
సీఆర్డీయేపై మరో కీలక నిర్ణయం- రాజధాని గ్రామాల్లో యూనిట్ ఆఫీసుల తరలింపు...
రాజధాని అమరావతి వ్యవహారంలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై దాఖలైన వాజ్యాల తుది విచారణ ప్రస్తుతం జరుగుతోంది. దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పిటిషనర్ లీలాకృష్ణ హైకోర్టును కోరారు. ఈ వాజ్యాలతో రాష్ట్రప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అందువల్ల వాటి విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా కోర్టుపై బురద జల్లేందుకు వీల్లేకుండా చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిని తన వాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఏపీలో ఇప్పటికే న్యాయవ్యవస్ధ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రయత్నిస్తుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీనిపై ప్రజల్లోనూ చర్చ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజధాని పిటిషన్లపై విచారణను లైవ్ ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలే ఈ పిల్ వెనుక ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.