ఏపీ గుళ్లలో స్వరూపానంద పుట్టినరోజు వేడుకలా ? అడ్డుకోవాలని హైకోర్టులో పిల్..
ఏపీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద పుట్టినరోజు వేడుకలను ఈ నెల 18న అధికారికంగా నిర్వహించాలని జగన్ సర్కారు ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో స్వరూపానంద పుట్టినరోజును దేవాలయాల్లో నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులోనూ ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.
రేపు శారదాపీఠాధిపతి స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా అన్ని ప్రధాన ఆలయాల్లో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాకుమాను లలిత్ కుమార్, మాడుగుల నాగ శంకర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేశారు. ఇందులో ప్రభుత్వ నిర్ణయం వెనుక హేతుబద్దతను, రాజ్యాంగబద్దతను వారు ప్రశ్నించారు. ప్రభుత్వం సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకుందని పిటిషనర్లు ఆరోపించారు. వెంటనే హైకోర్టు జోక్యం చేసుకుని ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని వారు కోరారు.
హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంలో పిటిషనర్లు పలు అంశాలను న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు. ఇందులో ఆర్టికల్ 26 ప్రకారం ప్రతీ గుడికీ ప్రత్యేక ఆచార, సంప్రదాయాలు ఉంటాయని వాటిని కాలరాసే విధంగా స్వరూపానంద పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని చెప్పడం సరికాదని హైకోర్టుకు తెలిపారు. ఆలయాల్లో ఇలాగే చేయాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపి ఓ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. వైసీపీ అధినేతగా ఉన్న జగన్ అధికారంలోకి రాకముందు నుంచే స్వరూపానంద భక్తుడిగా ఉన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన పలు విషయాల్లో ఇప్పటికీ ఆయన స్వరూపానంద సూచనలు, సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా స్వరూపానంద పుట్టినరోజు అధికారికంగా జరపాలని శారదాపీఠం నుంచి వచ్చిన విజ్ఞప్తిని దేవాదాయశాఖ ఏకంగా దేవాలయాలకే పంపడం వివాదాస్పదమైంది.