పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ వేణు: ప్లెక్సీ విషయంలో కార్యకర్తల డిష్యూం డిష్యూం..
వైసీపీ శ్రేణుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్లెక్సీల విషయంలో మొదలైన గొడవ.. దాడి వరకు వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు బాహ బాహీకి దిగారు. కలుగజేసుకొని పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు. తప్పు ఒకరిదంటే మరొకరిది అని ఆరోపణలు చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జిల్లా ఇంచార్జీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం పర్యటిస్తున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లెక్సీ ఒక్కటి చినిగిపోయింది. దీంతో గొడవ చెలరేగింది. తమ ప్లెక్సీని వేణు వర్గీయులే చింపేశారని బోస్ వర్గీయులు ఆరోపించారు.
ప్లెక్సీ విషయంలో మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కలుగజేసుకొన్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసి.. గొడవను సద్దుమణిగేలా చేశారు. వాస్తవానికి రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణు మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. బుధవారం ఏర్పాటు చేసిన ప్లెక్సీ చినగడంతో అదీ బహిర్గతమయ్యాయి.