సీట్ బెల్ట్ పెట్టుకుంటే బ్రతికేవారేమో?: గతంలో మృత్యువాత పడింది వీళ్లే (ఫోటోలు)
హైదరాబాద్: సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం కారణంగానే మంగళవారం ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి, డ్రైవర్ మృతి చెందారు.
సీట్ బెల్ట్ పెట్టుకున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు లాల్ జాన్ బాషా, కింజారపు ఎర్రన్నాయుడు, నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ లతో పాటు వైసీపీ నేత శోభానాగిరెడ్డి మృత్యువాత పడటానికి గల కారణం సీట్ బెల్ట్ ధరించకపోవడమే.
ఇక మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి కారు హైదరాబాద్లోని ఔటర్ రింగు రోడ్డులో ప్రమాదానికి గురైనప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఔటర్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సీట్ బెల్ట్ ధరించి ఉంటే అందరూ చిన్నపాటి గాయాలతో బయటపడేవారే.
కానీ వారు అలా చేయలేదు. ఈ ప్రమాదంలో సీట్ బెల్ట్ ధరించి ఉన్న ఆరవ్ రెడ్డి చిన్నపాటి గాయాలతో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి. నిజానికి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు సాగుతున్నట్లే.
ఈ క్రమంలో వాహనం హఠాత్తుగా వేగాన్ని కోల్పోతే, అందులో ప్రయాణిస్తున్న వారు అదే వేగంతో కారులో నుంచి ముందుకు వెళ్తారు. దీంతో ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను వేగంగా ఢీ కొడతారు. ఈ క్రమంలో వాహనం పల్టీ కొట్టిందంటే, అద్దాల్లోంచి, డోర్ నుంచి బయటకు వచ్చి పడితారు.
ఇలా జరగడం వల్ల వాహనంతో పాటు రోడ్డుపై కొంతమేరకు ఊడ్చుకుని వెళతారు. దీంతో శరీరానికి తీవ్ర గాయలై మృత్యువాతపడుతుంటారు. అదే మీరు గనుక సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాహనం ప్రమాదానికి గురైనప్పుడు కారులో ముందు సీట్లకు ఎదురుగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
ఎప్పుడైతే వాహనం ప్రమాదానికి గురవుతుందో తక్షణం అవి తెరుచుకుని డ్రైవర్తో పాటు పక్క సీటులో కూర్చున్న వారికీ ముప్పును తగ్గిస్తాయి. మంగళవారం ఔటర్లో పిన్నమనేని కారు ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్ స్వామిదాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోని ప్రాణ నష్టం తగ్గేదని వాహన రంగ నిపుణులు అంటున్నారు.
లాల్ జాన్ బాషా
2013లో నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సీట్ బెల్ట్ ధరించని కారణంగానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా ప్రాణాలు విడిచారు. లాల్ జాన్ బాషా తన వాహనంలో హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాల్ జాన్ బాషా ప్రయాణిస్తున్న వాహనం నార్కట్ పల్లి సమీపంలో ఓ డివైడర్ను ఢీకొట్టింది.
కింజారపు ఎర్రన్నాయుడు
2012లో విశాఖపట్నంలో ఓ పెళ్లికి హాజరై ఎర్రన్నాయుడు కారులో తిరిగి వస్తుండగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలు ట్యాంకర్ను ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృత్యువాతపడ్డారు. సీట్ బెల్ట్ ధరించని కారణంగానే ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
శోభానాగి రెడ్డి
వైసీపీకి చెందిన శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో నంద్యాల నుంచి బయల్దేరిన శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ వద్దకు రాగానే రోడ్డుపై వరి కుప్పలు ఉండటంతో డ్రైవర్ నాగేంద్ర కారును పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వాహనాన్ని నియంత్రించలేక పోవడంతో ప్రమాదం జరిగిందని, దీంతో కారు నాలుగు పల్టీలు కొట్టి వంద గజాల దూరంలో పడింది. సీటు బెల్టు పెట్టుకోనందున శోభా నాగిరెడ్డి కారు ముందు అధ్దంలోంచి దూరంగా పడిపోయి మృత్యువాతపడ్డారు.
పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్య వాణి
సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం కారణంగానే మంగళవారం ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి, డ్రైవర్ మృతి చెందారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
నందమూరి జానకి రామ్
హరికృష్ణ పెద్ద కుమారుడయిన జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఏపీ 29 బీడీ 2323 కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదకర రోడ్డు మలుపులో రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే జానకి రామ్ మృత్యువాత పడ్డారు.
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు మంత్రి కోమటిరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మరణించారు. ఔటర్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సీట్ బెల్ట్ ధరించి ఉంటే అందరూ చిన్నపాటి గాయాలతో బయటపడేవారే.