ఫెర్రీ ప్రాంతంలో రాకాసి చేపలు...బెంబేలెత్తుతున్న మత్స్యకారులు
కృష్ణా జిల్లా:కృష్ణానది తీరంలోని ఫెర్రీ ప్రాంతంలో నీళ్లల్లో పిరాణా తరహా రాకాసి చేపలు తరుచూ దర్శనమిస్తుండటంపై స్థానిక మత్స్యకారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ చేపలు వారికి ఎందుకు పనికిరాకపోగా ప్రమాదకరం, నష్టదాయకం కావడంతో వీటి ఉనికి మత్స్యకారులను బెంబేలెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే...
కెబొజోన్ జాతికి చెందినవిగా భావిస్తున్న ఈ చేపలకు వళ్లంతా ముళ్లతో రాక్షసిలా కనిపిస్తుంది. తినేందుకు ఏమాత్రం పనికిరాని ఈ చేపల నుంచి తీవ్రమైన దుర్వాసన కూడా వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. పెద్దనోరు కలిగి చిన్నచేపలను అమాంతం మింగేయటంతో పాటు నదిలో చేపల వేట కోసమని వేసిన వలలను కూడా ఇవి కొరికేసి తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా జాలర్లు వాపోయారు.
ప్రతి ఏడాది పట్టిసీమ కాలువ నుంచి కృష్ణానదికి గోదావరి జలాలు వదిలిన సమయంలోనే ఈ చేపలు కనిపిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఈసారి కారణమేంటో తెలియదు కాని ఇవి ఎక్కువ సంఖ్యలో ఫెర్రీ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయని తెలిపారు. వీటి ధాటికి దడిసి చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నామని మత్స్యకారులు చెబుతుండటం గమనార్హం.