టిడిపిలోకి పితాని?: పార్టీ మారేందుకు సిద్ధమని ప్రకటన
పశ్చిమగోదావరి: మాజీ మంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ నేత పితాని సత్యనారాయణ తను పార్టీ మారేందుకు సిద్ధమని ప్రకటించారు. సోమవారం భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తమ నేత పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పితాని సత్యనారాయణ వారితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల వెంటే తాను నడుస్తానని.. అభిమానుల కోరిక మేరకు పార్టీ మారేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. కాగా, పితాని టిడిపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
టిడిపిలోకి భీమవరం మాజీ ఎమ్మెల్యే
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు, విశాఖపట్నం జిల్లాకు చెందిన పల్లా శ్రీనివాస్రావు టిపిపిలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అనేక మంది నాయకులు టిడిపిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు.