చంద్రబాబుకు మరో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత షాకివ్వనున్నారా?: జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఆ పార్టీ సీనియర్ నేత షాకివ్వనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
టీడీపీ కార్యక్రమాలకు దూరంగా..
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం గమనార్హం. పార్టీ కార్యకర్తలను కూడా ఆయన కలుసుకోవడం లేదని తెలిసింది. అంతేగాక, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపుకోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
వైసీపీ నుంచి పిలుపు కోసం..
అయితే, అధికార వైసీపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు పితానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలోనే పితానిని పార్టీలోకి తీసుకుంటే తమకు కొంత మేర కలిసివస్తుందని అధికార పార్టీ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పితాని సత్యనారాయణ పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
Recommended Video
వైఎస్ కేబినెట్లోనూ మంత్రిగా పితాని.. జగన్ పిలుపు కోసం
కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పితాని సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2014లో టీడీపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఆచంట నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పితానిపై గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు వైఎస్ జగన్ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించాలని పితాని కోరుతున్నట్లు సమాచారం. ఈ అంశంలో జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మాజీ మంత్రి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.