‘పీకే’కు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసన.. పోస్టర్లు, ప్లెక్సీల దహనం
హైదరాబాద్: అమీర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు వ్యతిరేకంగా హిందువుల ఆందోళనలు వెల్లువత్తుతున్నాయి. మతభావాలు కించపరిచేలా ఉన్న సన్నివేశాలని సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, పీకే సినిమా ద్వారా మరింతగా రెచ్చగొట్టవద్దని కోరారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
గుజరాత్ రాష్ట్రంలో పలు థియేటర్ల పైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో పీకే చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ వద్ద మంగళవారం నాడు బంజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారు దాడికి పాల్పడటంతో థియేటర్ అద్దాలు పగిలిన విషయం తెలిసిందే.
ఇప్పుడు 'పీకే' సినిమాలోని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మంగళవారం దిల్సుఖ్నగర్లోని మేఘ థియేటర్ వద్ద భజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పీకే సినిమా పోస్టర్లు, ప్లెక్సీలను దహనం చేశారు. సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ‘పీకే' చిత్రం పైన సాంఘీక బహిష్కరణ విధించాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. ఈ చిత్రంలో హిందూ దేవుళ్లను కించపరిచారని, హిందూ సంస్కృతిని తక్కువ చేసి చూపించారని మండిపడ్డ విషయం తెలిసిందే.
బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఇంకో అడుగు ముందుకేసి పీకే చిత్రం పైన తాను ఫిర్యాదు చేస్తానని అన్నారు. పీఎంఎల్ఏ కింద తాను అమీర్ ఖాన్, తదితరుల పైన ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 'పీకే' సినిమా నిర్మాణానికి పాకిస్ధాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ పెట్టుబడి పెట్టిందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. పీకే సినిమా నిర్మించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.