వైసీపీ వ్యూహం: వైవీ సుబ్బారెడ్డికి పీకే టీం షాక్, ఒంగోలు లోకసభ నుంచి షర్మిల? కారణాలెన్నో
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లోకసభకు పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. ఆమె కడప లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే కడప కాదని, ప్రకాశం జిల్లా ఒంగోలు లోకసభకు పోటీ చేస్తారని తాజాగా వినిపిస్తున్న మాట.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంతి కిషోర్ (పీకే) సూచనల ఆధారంగా జగన్ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా పీకే బృందం ఏపీ వ్యాప్తంగా పర్యటించిందట. వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్యుల అభిప్రాయాలను సేకరించింది.
ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపై
వైవీని పక్కన పెట్టి షర్మిలను తెరపైకి తేవడానికి కారణం
ఈ నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి వైవీ సుబ్బారెడ్డిని కాకుండా వైయస్ షర్మిలను బరిలోకి దింపాలని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా ఉందట. వైవీ సుబ్బారెడ్డి కారణంగా జిల్లాలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని, జిల్లాలో వైవీ వర్గం, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఉందని గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైవీని పక్కన పెట్టి షర్మిలకు లోకసభ టిక్కెట్ ఇస్తే అందరూ ఏకతాటి పైకి వస్తారని సూచనలు చేశారని అంటున్నారు.
జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జిల్లాలో రాజకీయం తన కనుసన్నుల్లో నడవాలనే ఉద్దేశ్యం వైవీలో ఉందని, ఇది బాలినేని వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆధిపత్య ధోరణి కారణంగా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లోను వైవీ ఒకరిని తెరపైకి తీసుకు వస్తే.. బాలినేని మరొకరిని తెస్తున్నారట. ఈ నేపథ్యంలో వైవీ మళ్లీ పోటీ చేస్తే అసలుకే ముప్పు వచ్చే అవకాశముందని, కాబట్టి షర్మిలను దించాలని చెప్పారట. పార్టీలోని రెండు వర్గాలతో పాటు సామాన్యుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా షర్మిల రంగంలోకి దిగితే బెట్టర్ అని పీకే టీం సూచించిందని అంటున్నారు.
వచ్చేస్తోంది జగన్ వదిలిన బాణం: పోటీ అక్కడి నుంచే..?
షర్మిలను దింపితే ప్లస్
ఇక్కడి నుంచి షర్మిలను రంగంలోకి దింపితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని, తద్వారా ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి గెలిచే అవకాశముంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. షర్మిలను రంగంలోకి దింపితే గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకోవచ్చునని అంటున్నారు. షర్మిల లోకసభకు పోటీ చేస్తే జిల్లాలోని 12 నియోజకవర్గాలపై ప్రభావం కనిపిస్తుందని చెప్పారని తెలుస్తోంది.
వైవీకి బుజ్జగింపు అలా
అయితే, దీనిపై పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. షర్మిలను బరిలోకి దింపితే... వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ స్థానం లేదా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు. అయితే జగన్ ఏం చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.