డబ్బు ఇస్తారా చావమంటారా , బ్యాంకు ఎదుట పురుగులమందుతో దంపతుల నిరసన
తమ కుమారుడి వివాహం కోసం లక్ష రూపాయాల నగదును ఇవ్వకపోతే పురుగులమందు తాగి ఆత్మహత్యచేసుకొంటామని పుల్లయ్య, వెంకటేశ్వరమ్మ దంపతులు హెచ్చరించారు.
కర్నూల్ :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం వివాహలు, శుభకార్యాలపై తీవ్రంగా పడుతోంది. రద్దు చేసిన నగదును బ్యాంకులో డిపాజిట్లు చేసుకొంటున్నారు. కాని, అవసరానికి డబ్బులు ఇవ్వకుండా నిబంధలను సాకుగా చూపుతున్నారని ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి వివాహం కోసం డబ్బులు ఇవ్వకుండా బ్యాంకు సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకు ముందే ఆత్మహత్య చేసుకొంటామని పురుగులమందు డబ్బాలతో దంపతులు నిరసన తెలిపిన ఘటన కర్నూల్ లో చోటుచేసుకొంది.
కర్నూల్ జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామానికి చెందిన పుల్లయ్య, వెంకటేశ్వరమ్మ దంపతులు పెద్ద కుమారుడు మోహనస్వామన్న వివాహం డిసెంబర్ 1వ, తేదిన జరపాలని నిర్ణయించుకొన్నారు. అయితే పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాహంపై ప్రభావం పడింది. ఈ నగదును రద్దు చేయకముందే వివాహనికి సంబందించిన ఏర్పాట్లు కూడ ప్రారంభించారు.
వివాహ పత్రికలను బంధువులకు పంచారు. అయితే ఈ లోపుగానే పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా తమ వద్ద ఉన్న పాత నగదు లక్ష రూపాయాలను పుల్లయ్య దంపతులు పారుమంచాల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేశారు. తమ కుమారుడి వివాహం ఉందని, ఆ వివాహం సందర్భంగా డబ్బులను ఇవ్వాలని కూడ ఆ దంపతులు కోరారు. అయితే డబ్బులు డిపాజిట్ చేసుకొనే సమయంలో బ్యాంకు అధికారులు అంగీకరించి, ప్రస్తుతం డబ్బులు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని పుల్లయ్య ఆరోపిస్తున్నాడు.
వివాహానికి అవసరమైన సామాను, బట్టలు ఇతర వాటికి డబ్బులు అవసరం ఉన్నాయని, బ్యాంకు అధికారులు నిబంధనల సాకును చూపి డబ్బులు ఇవ్వడం లేదని పుల్లయ్య చెబుతున్నాడు. మంగళవారం నాడు పుల్లయ్య తన భార్యతో కలిసి బ్యాంకులో డబ్బును డ్రా చేసుకొనేందుకు వచ్చాడు. అయితే నిబంధనలను అధికారులు సాకుగా చూపారు. పురుగులమందు డబ్బాను తెచ్చుకొని , తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకొంటామని హెచ్చరించారు.
తమ పరిస్థితిని చూసి కనికరించాలని కోరుతున్నారు ఆ దంపతులు. ఈ విషయమై జిల్లా ఎస్ పి రవికృస్ణను కలిసి విన్నవిస్తామని ఆ దంపతులు చెప్పారు.బుదవారం సాయంత్రం వరకు తమకు డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకు ఎదుటే ఆత్మహత్య చేసుకొంటామని వారు హెచ్చరించారు. అయితే తాము కోరుతున్న డబ్బు బ్యాంకుకు రావడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పుల్లయ్య కుటుంబానికి రెండురోజుల్లో డబ్బులను సర్థే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.