ఎయిర్ఏషియా కేసు: ‘చంద్రబాబును పట్టుకుంటే అంతే’, చర్చనీయాంశంగా సంభాషణ
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా కేసుకు సంబంధించి తాజాగా వెలువడిన సంభాషణల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుల పేర్లు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్ ఏషియా లంచాలు ఎర వేసింది.
దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను ఇప్పటికే అరెస్టు చేసింది.
30నిమిషాల సంభాషణ
కాగా, అవినీతి కేసులో సీబీఐకి ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే' ఓ కథనాన్ని ప్రచురించింది.
చంద్రబాబు, అశోక్ గజపతిరాజు పేర్లు
కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. సులభంగా పర్మిట్లు రావాలంటే ఏపీ సీఎం చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి.
చంద్రబాబును తిప్పుకుంటే.. అశోక్ గజపతి రాజే..
‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారు. పీఎం అయ్యే సామర్థ్యం ఉన్న చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉన్నారు' అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడటం గమనార్హం.
చర్చనీయాంశంగా పేర్ల అంశం
కాగా, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. ఈ కేసులో ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఎన్టీఏ నుంచి బయటికివచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసుకు సంబంధించిన సంభాషణల్లో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు పేర్లు ప్రస్తావనకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.